వలస కూలీల కన్నీటి వ్యథ.. 5 రోజులు.. తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక..
స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతించాలని కోరినందుకు ఓ ఇటుక బట్టీ యజమాని వలస కూలీలపై తన ప్రతాపం చూపించాడు. అనుచరులను వారి పైకి ఉసిగొల్పి దాడి చేయించాడు. ఐదు రోజులుగా తమకు తిండి పెట్టట్లేదని.. కనీసం తాగేందుకు మంచినీళ్లు కూడా ఇవ్వట్లేదని.. ఇలాంటి పరిస్థితుల్లో తాము ఎలా ఇక్కడ ఉండగలమని ఆ కూలీలు మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఊళ్లకు తాము పోతామంటే దాడి చేయడమేంటని కన్నీటిపర్యంతమయ్యారు.

400 మంది వలస కూలీలు..
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఉన్న పుదుకుప్పంలోని ఓ ఇటుక బట్టీలో దాదాపు 400 మంది వలస కూలీలు పనిచేస్తున్నారు. ఒడిశాకు చెందిన వీరు లాక్ డౌన్ కారణంగా ఇక్కడే చిక్కుకుపోయారు. వీరి తిండీ తిప్పలు పట్టించుకోవాల్సిన యజమాని వారిని గాలికి వదిలేశాడు. ఇటీవల లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో తమ స్వస్థలాలకు వెళ్లిపోవాలని భావించారు. ఇదే విషయాన్ని యజమాని ప్రధాన అనుచరుడి దృష్టికి తీసుకెళ్లగా.. అందుకు అతను నిరాకరించాడు.

ఆఖరికి చిన్నపిల్లలను కూడా వదలకుండా..
అలా పలుమార్లు వలస కూలీలంతా అతన్ని అభ్యర్థించారు. స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతించాలని ప్రాధేయపడ్డారు. కానీ అతను కనికరించలేదు సరి కదా దాడికి పాల్పడ్డాడు. మంగళవారం కూలీలంతా కలిసి కాస్త గట్టిగా నిలదీసేసరికి.. అనుచరులతో కలిసి వారిని చితకబాదాడు. దీంతో ఇద్దరు కూలీలకు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రి పాలయ్యారు.దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తమకు ఐదు రోజులుగా కనీసం తాగేందుకు మంచినీళ్లు కూడా ఇవ్వట్లేదని.. అలాంటప్పుడు ఇక్కడెలా ఉండగలుగుతామని ఆ కూలీలు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆఖరికి చిన్న పిల్లలను కూడా వదిలిపెట్టకుండా... వారిపై కూడా దాడి చేశారన్నారు.
Recommended Video

పోలీసులు ఏమంటున్నారు..
పోలీసులు కూడా దర్యాప్తులో ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. కనీస మౌలిక సదుపాయాలు కూడా యాజమాన్యం వారికి కల్పించలేదన్నారు. తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారన్నారు.ఈ ఘటన తర్వాత ఆ ఇటుక బట్టీ యజమాని పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు వారిని వెతికి పట్టుకునే పనిలో ఉన్నారు. మరోవైపు ఇప్పటికైనా తమను స్వస్థలాలకు పంపించేలా చూడాలంటూ వలస కూలీలను పోలీసులను వేడుకున్నారు. దీంతో అధికారులతో మాట్లాడి అవసరమైన ఏర్పాట్లు చేస్తామని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications