వాజపేయితో స్నేహబంధం: మాటలు లేవంటూ మోడీ, ఒంటరినయ్యానంటూ అద్వానీ
Recommended Video
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి(93) మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించారు.
యుగాంతంలా..
అటల్జీ లేకపోవడం శూన్యంలా అనిపిస్తోందని, నిశ్శబ్దంలా గోచరిస్తోందని, వాజ్పేయి లేరనేది ఒక యుగాంతంలా అనిపిస్తోందని ప్రధాని మోడీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజకీయా రంగానికి వాజ్పేయి మరణం తీరని లోటు అన్నారు. బీజేపీ ఒక గొప్ప నాయకున్ని కోల్పొయిందని పేర్కొన్నారు.
మాటలు రావడం లేదు
‘నాకు మాటలు రావడం లేదు. అటల్జీ మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. ఆయన ప్రతి నిమిషం దేశం కోసం పనిచేశారు. ప్రియమైన నేత అటల్ బిహారీ వాజ్పేయి దివంగతులుకావడంతో భారతదేశం శోక సముద్రంలో మునిగిపోయింది' అని మోడీ ట్వీట్ చేశారు. ఆయన దివంగతులు కావడంతో ఓ శకం ముగిసిందని పేర్కొన్నారు. ఆయన దశాబ్దాలుగా దేశం కోసం జీవించారని, అత్యంత శ్రద్ధాసక్తులతో దేశానికి సేవ చేశారని పేర్కొన్నారు.
వాజపేయి, మోడీ స్నేహ బంధం:
వాజ్పేయి, మోడీల మధ్య అనుబంధానికి అద్దం పట్టే అరుదైన వీడియో ఒకటి ఇప్పుడు మరోసారి వెలుగులోకి వచ్చింది. బీజేపీ సామాన్య కార్యకర్తగా ఉన్న సమయంలో మోడీ అప్పటి భారత ప్రధాని వాజ్పేయిని కలుసుకున్నారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి హాజరైన అటల్ జీ దగ్గరికి వచ్చేందుకు మోడీ ప్రయత్నించిగా.. ఆయనను అక్కున చేర్చుకున్న వాజ్పేయి వెన్న తట్టి, ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది
ఒంటరినయ్యానంటూ అద్వానీ
అటల్ బిహారీ వాజ్పేయి(93) మృతి పట్ల పార్టీ సీనియర్ నాయకుడు ఎల్ కే అద్వాని తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ‘ఐ మిస్ యూ అటల్ జీ' అంటూ తన బాధను వ్యక్తం చేశారు. తాను ఒంటరినయ్యానంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ‘వాజ్పేయి మరణం నన్ను తీవ్రంగా కలిచివేసింది. తీవ్రం దుఃఖంతో నేనున్నాను. నోట మాట రావడం లేదు. 65 ఏళ్ల స్నేహం మాది. ఆరెస్సెస్లో ప్రచారకర్తలుగా ప్రారంభమైన మా అనుబంధం భారతీయ జన్ సంఘ్లోనూ కొనసాగింది. జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ వరకు కలిసే ప్రయాణించాం. ఎమర్జెన్సీ చీకటి రోజులను కలిసే ఎదుర్కొన్నాం. అపారమైన దేశ భక్తి, అన్నింటికి మించి మానవతా విలువలు ఉన్న గొప్ప వ్యక్తి. సైద్ధాంతిక విభేదాలున్నా ప్రతి ఒక్కరిని హృదయాన్ని గెలిచిన వ్యక్తిత్వం వాజ్పేయికి సొంతం' అంటూ అటల్ జీతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఉద్వేగానికి గురయ్యారు.