ఫ్యాషన్ డిజైనర్ అదృశ్యం: ఆమె కారు దొరికింది
న్యఢిల్లీ: సోమవారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయిన మహిళా ఫ్యాషన్ డిజైనర్కి చెందిన కారు దొరికింది. అయితే, ఆమె ఆచూకీ ఇంకా తెలియలేదు. నోయిడాకు చెందిన శిప్రా మాలిక్ అనే ఫ్యాషన్ డిజైనర్ ఢిల్లీలో బొటిక్ నిర్వహిస్తోంది.
మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సాయం కోసం ఆమె పోలీసులకు ఫోన్ చేసింది. ఆ తర్వాత ఉన్నట్టుండి ఆమె అదృశ్యమైంది. ఈ నేపథ్యంలో పోలీసులు శిప్రా ఆచూకీ కోసం గాలిస్తుండగా ఆమె తెల్ల స్విఫ్ట్ కారు నోయిడాలో లభ్యమైంది.
ఆ కారు ఆమె నివాసానికి 500 మీటర్ల దూరంలోనే ఉందని పోలీసులు చెప్పారు. కాగా, అందులో కారు తాళాలు కూడా ఉన్నాయని పోలీసులు తెలిపారు. శిప్రా భర్త చేతన్ మాలిక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని చెప్పారు.
ఆమె మొబైల్ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వస్తోందని తెలిపారు. శిప్రా అదృశ్యమయ్యాక ఎలాంటి బెదిరింపు కాల్స్ రాలేదని త్వరలో యువతి ఆచూకీ తెలుసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.
కాగా, ఇటీవల స్నాప్డీ సంస్థకు చెందిన ఓ మహిళా ఉద్యోగిని అదృశ్యమై 40గంటల తర్వాత క్షేమంగా ఇంటికి చేరుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ 29ఏళ్ల ఫ్యాషన్ డిజైనర్ అదృశ్యం కలకలం రేపుతోంది.