ఉపఎన్నిక: జయ నామినేషన్ దాఖలు, ఖుష్పూ పోటీ చేస్తుందా..?
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెన్నైలోని రాధాకృష్ణన్ (ఆర్కే) నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. జూన్ 27న ఈ స్ధానానికి ఉపఎన్నిక జరగనుంది.
అక్రమాస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా తీర్పు వెల్లడించడంతో ఇటీవలే జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆరునెలల్లో ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది. దీంతో మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు జయలలిత ఆర్కే నగర్ నుంచి పోటీ చేస్తున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పైన తాము పోటీకి దూరంగా ఉంటున్నట్లు డీఎంకే అధ్యక్షులు కరుణానిధి తెలిపారు. జయ పోటీ చేయనున్న ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి డీఎంకే తరఫున ఎవరు పోటీ చేయరని చెప్పారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది కూడా లేదు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని కరుణానిధి నిర్ణయించారు. ఇతర పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారా లేదా అనే విషయం తేలాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఖుష్పూ పోటీ చేస్తుండవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ముఖ్యమంత్రి పదవిని, శ్రీరంగం శాసన సభ స్థానం ప్రాతినిథ్యాన్ని గతంలో జయలలిత కోల్పోయారు. అనంతరం హైకోర్టులో ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆమెను కోర్టు నిర్దోషిగా చెప్పింది.
దీంతో ఆమె తిరిగి ముఖ్యమంత్రిగా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అమ్మ కోసం ఆర్కే నగర్ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన వెట్రివేలు ఇటీవలే రాజీనామా చేశారు.