ప్రధాని మోడీ నోట నా పేరు: నూర్జహాన్ ఉబ్బితబ్బిబ్బు
ఢిల్లీ/కాన్పూర్: ప్రధాని నరేంద్ర మోడీ 'మన్ కీ బాత్'లో ప్రశంసలు పొందిన నూర్జహాన్ సంతోషం పట్టలేకపోతున్నారు. ప్రధాని స్వయంగా ఆమె పేరు ప్రస్తావించడంతో ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. బేరీ దరియావాన్ గ్రామంలోని ఆమె ఇల్లు ఇప్పుడు బిజెపి నాయకులు, మీడియా కిటకిటలాడుతోంది.
ప్రధాని తన పేరు ప్రస్తావించడం, తన పని మెచ్చుకోవడం గొప్ప నైతిక ధైర్యాన్నిస్తుందని ఆమె సంతోషించారు. ఆమె వయస్సు యాభై అయిదేళ్లు. ఇరవై ఏళ్ల కిందట భర్త నిరాకరణకు గురైన ఆమె తన చిన్నపిల్లలను ఎలా పెంచాలో తెలియక మొదట్లో సతమతమయ్యేవారు.
కూలి పనులు చేయగా వచ్చే రోజుకు రూ.15తో కడుపు నింపుకునేవారు. మూడేళ్ల కిందట ఓ స్వచ్ఛంద సంస్థ గ్రామంలోకి అడుగుపెట్టడంతో ఆమె జీవితం మారిపోయింది. ఎన్జీవో నుంచి సౌర దీపాలు పొందిన నూర్జహాన్ ముందు తన ఇంటి అవసరాలకు వాడుకుంటూ తర్వాత ఇతరులకు అద్దెకివ్వడం ప్రారంభించారు.
ప్రస్తుతం ఊహించనంత పేరు రావడంతో ప్రభుత్వం సాయం కోసం ఎదురు చూస్తున్నారు. సాయం అందితే మరిన్ని విద్యుద్దీపాలను మరింతమందికి అద్దెకిస్తానని చెబుతోంది. ప్రధాని మోడీ ఆదివారం మన్ కీ బాత్లో మాట్లాడిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశ ఐకమత్యాన్ని, సామరస్యాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఏక భారత్ -శ్రేష్ఠ భారత్ నినాదానికి పథకం రూపునివ్వనున్నట్లు చెప్పారు. ఈ పథకం రూపురేఖలపై సూచనలు ఆహ్వానించారు.
పథకం రూపురేఖలు ఎలా ఉండాలి, లోగో, ప్రజాభాగస్వామ్యం అంశాలపై వెబ్సైట్లో ప్రజలు సూచనలు ఇవ్వాలని కోరారు. ఇది చాలా ప్రత్యేక పథకం కాబోతోందని, ఐక్యతా మంత్రంతో ప్రతి భారతీయుడినీ ఎలా అనుసంధానించవచ్చో మీ సృజనాత్మక ఆలోచనలను పంచుకోవాలని ప్రధాని మోడీ కోరారు.
పథకం ఏ రీతిన ఉండాలో, పథకంలో భాగంగా ప్రభుత్వం ఏం చేయాలో, పౌర సమాజం ఏం చేయాలో సూచించాలన్నారు. దేశంలో అసహనం పెరిగిపోతోందంటూ కొంతమంది ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ ఈ పథకాన్ని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అవయవదానానికి ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు రావాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. అంగవైకల్యం ఉన్న వారు శారీరక లోపాన్ని అధిగమించి ఏ విధంగా స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నదీ ప్రధాని వివరించారు. కశ్మీర్కు చెందిన జావేద్ అహ్మద్ అనే వ్యక్తి గురించి ఉదహరించారు.
జావేద్ను 1996లో ఉగ్రవాదులు కాల్చగా వెన్నెముక గాయాలతో అతను వికలాంగుడయ్యాడు. ఆ తర్వాత నిలబడలేకపోయాడని, అతని యవ్వనమంతా నాశనమయిందని, అయినా అతను కోపగించుకోలేదని, ఓటమినీ అంగీకరించలేదని, ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకున్నాడని, సమాజ సేవకు జీవితాన్ని అంకితం చేశాడన్నారు.
గత 20 ఏళ్లుగా పిల్లలకు పాఠాలు చెబుతున్నాడని, బహిరంగ ప్రదేశాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో వికలాంగులకు మౌలిక వసతులు ఏ విధంగా మెరుగపర్చవచ్చో ఆలోచిస్తూ ఆ దిశగా పని చేస్తున్నాడని, వికలాంగులకు అతనో రక్షకుడిగా మారాడని, డిసెంబరు 3న వికలాంగుల దినోత్సవం సందర్భంగా అతని సేవలను ప్రత్యేకంగా గుర్తు చేసుకుందామని, జావేద్ లాంటివారు దేశం నలుమూలలా ఉన్నారన్నారు. మనకు స్ఫూర్తినిస్తున్నారన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... పెద్దగా చదువుకోని కాన్పూర్కు చెందిన నూర్జహాన్ సౌర దీపాల కర్మాగారాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ దీపాలను దాదాపు 500 ఇళ్లకు అద్దెకు ఇస్తారని, నెలకు రూ.100 చొప్పున అద్దె వసూలు చేస్తారని తెలిపారు. ఛార్జింగ్కు రోజుకు రూ.3నుంచి రూ.4 అవుతుందన్నారు. నూర్జహాన్ అంటే ప్రపంచానికి వెలుగునివ్వడం అని అర్థమని, సార్థక నామథేయురాలని ప్రధాని కొనియాడారు.