సాక్ట్మార్కెట్లపై ‘హైడ్రోజన్ బాంబు’ , భగ్గుమన్న బంగారం ధర!
ఉత్తరకొరియా అణుపరీక్ష నేపథ్యంలో అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రభావం మన స్టాక్మార్కెట్ల పైనా పడింది.
ముంబై: ఉత్తరకొరియా అణుపరీక్ష నేపథ్యంలో అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రభావం మన స్టాక్మార్కెట్ల పైనా పడింది. ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో దేశీయ సూచీలు నేడు నష్టాలను మూటగట్టుకున్నాయి. దీనికి తోడు బ్యాంకింగ్ రంగాల షేర్లు కూడా నష్టాల్లో పయనించడం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. దీంతో సూచీలు ఢీలా పడ్డాయి.
ఈ ఉదయం 56 పాయింట్ల నష్టంతో 31,835 వద్ద బలహీనంగా ప్రారంభమైన సెన్సెక్స్.. మధ్యాహ్నానికి మరింత నష్టాల్లోకి జారుకుంది. ఒకానొక దశలో 300 పాయింట్లు కోల్పోయిన సూచీ.. ఆ తర్వాత కాస్త కోలుకుంది. అయితే చివరకు 190 పాయింట్ల నష్టంతో 31,702 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ 71 పాయింట్లు నష్టపోయి 9,903 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ రూ. 64.08గా కొనసాగుతోంది.
ఎన్ఎస్ఈలో కోల్ఇండియా, సన్ఫార్మా, బాష్ లిమిటెడ్, ఓఎన్జీసీ, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు లాభపడగా.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, అదానీపోర్ట్స్, ఏసీసీ లిమిటెడ్, టాటామోటర్స్(డి), ఇన్ఫోసిస్ షేర్లు నష్టపోయాయి.
భవిష్యత్తుపై భయాలు..
ఉత్తర కొరియా మరిన్ని క్షిపణి పరీక్షలకు సన్నాహాలు చేస్తోందని దక్షిణ కొరియా ప్రకటించింది. వీటిల్లో ఖండాంతర క్షిపణులు కూడా ఉండవచ్చని పేర్కొంది. ఈ ప్రకటన మార్కెట్లలో తీవ్ర భయాన్ని రేపింది. సెన్సెక్స్ ఒక్కసారిగా 300 పాయింట్లు.. నిఫ్టీ 93పాయింట్లు కోల్పోయాయి. అన్ని సెక్టార్ల షేర్లు నష్టాల్లో ఉన్నాయంటే మార్కెట్ భయాల్ని అర్థం చేసుకోవచ్చు. రియల్ఎస్టేట్ రంగం షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. దీంతోపాటు జపాన్ ఇండెక్స్ నిక్కీ 0.9శాతం నష్టపోయింది. దక్షిణకొరియా ఇండెక్స్ కోస్పీ కూడా 1.1శాతం, హాంగ్కాంగ్ మార్కెట్ అయిన హ్యాంగ్సంగ్ 0.8 శాతం నష్టపోయాయి. చైనా మార్కెట్లు మాత్రం లాభాల్లో ట్రేడయ్యాయి. మరోపక్క అమెరికా కూడా కయ్యానికి సై అనటంతో డోజోన్స్ ప్రస్తుతం 0.5శాతం నష్టాల్లో ట్రేడవుతోంది.
భారీ సంఖ్యలో షేర్ల విక్రయం!
పలు పెద్ద కంపెనీల షేర్లను పెట్టుబడిదారుల భారీ సంఖ్యలో విక్రయించారు. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్ రంగాలకు చెందిన షేర్లను విక్రయించారు. దీంతో ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటక్ బ్యాంక్, ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, హిందూస్థాన్ యూనీలీవర్, యాక్సెస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, టాటామోటార్స్లో కౌంటర్లలో విక్రయాలు ఎక్కువగా జరిగాయి. కేవలం ఈ షేర్ల అమ్మకాలతోనే సెన్సెక్స్ 200 పాయింట్లు కుంగింది. దీనికి తోడు టెక్నికల్ కారణాల వల్ల కూడా విశ్లేషకులు లాభాల స్వీకరణను సూచించారు.
భగ్గుమన్న బంగారం ధర... ఏకంగా ఏడాది గరిష్ఠానికి...
పసిడి ధర మరోసారి చుక్కల్ని తాకింది. ఎంతలా అంటే.. ఈ ఏడాదిలోనే అత్యంత గరిష్ఠానికి చేరింది. ఉత్తరకొరియా హైడ్రోజన్ బాంబును పరీక్షించడంతో అంతర్జాతీయంగా రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. ఇది పసిడి ధరపై ప్రభావం చూపింది. దీనికి తోడు స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడం కూడా బంగారం ధర పెరుగుదలకు కారణమైందని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. సోమవారం నాటి ట్రేడింగ్లో రూ.200 పెరగడం ద్వారా 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.30,600కు చేరింది. మరోపక్క వెండి ధర కూడా రూ.200 పెరిగి కిలో వెండి రూ.41,700కు చేరింది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ కారణంగానే వెండి ధర పెరిగింది. అంతర్జాతీయంగా బంగారం ధర రూ.0.71శాతం పెరిగి ఔన్సు 1,333.80 డాలర్లు పలికింది. దేశీయంగా పసిడి ధర గత రెండు సెషన్లలో రూ.350 పెరగడం గమనార్హం.
ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల కౌంటర్లలో విక్రయాలు...
ఆగస్టులో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లే అత్యధిక విక్రయాలకు పాల్పడినట్లు నివేదికలు సూచిస్తుండటంతో మార్కెట్లు మరింత పడతాయేమోననే భయంతో అమ్మకాలు చేపట్టారు. ఆగస్టులో విదేశీ పెట్టుబడిదారులు అత్యధికంగా రూ.14,293 కోట్ల మేరకు విక్రయాలకు పాల్పడ్డారు. 2018 ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసిక ఫలితాలు బలహీనంగా ఉండటం, జీఎస్టీకి సంబంధించిన భయాలతో విక్రయాలు జరిగాయి.