ప్రధానిగా నో! రాజకీయాల్లో ఉండను: యోగి సంచలన వ్యాఖ్యలు
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం సంచలన ప్రకటన చేశారు. తాను పూర్తికాలం రాజకీయాల్లో ఉండనని స్పష్టం చేశారు. తాను తిరిగి తన మఠానికి వెళ్లిపోతానని తెలిపారు.
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం సంచలన ప్రకటన చేశారు. తాను పూర్తికాలం రాజకీయాల్లో ఉండనని స్పష్టం చేశారు. తాను తిరిగి తన మఠానికి వెళ్లిపోతానని తెలిపారు.
చదవండి: రెచ్చిపోతున్న చైనా: పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీదుగా.., ఇది ప్లాన్!
తాను ఎప్పటికీ రాజకీయ నాయకుడిగా ఉండనని, కేవలం ప్రజలకు సేవ చేసేందుకు మాత్రమే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. కాబట్టి ఎప్పటికీ ఇందులోనే ఉండనని తెలిపారు.
ప్రధాని అయ్యే అవకాశం ఉందా అని ప్రశ్నిస్తే..
భవిష్యత్తులో దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలున్నాయా అని ఆయన్ను మీడియా ప్రశ్నించింది. దీనికి యోగి సమాధానం చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా తనకు ఉత్తర్ప్రదేశ్ బాధ్యతలను అప్పజెప్పడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.
జీవితం మొత్తం రాజకీయాలకు అంకితం చేయలేను
తనకు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేశాక తిరిగి తాను తన మఠానికి వెళ్లాలని భావిస్తున్నట్లు యోగి తెలిపారు. జీవితం మొత్తం రాజకీయాలకే అంకితం చేయడం తనకు ఆమోదయోగ్యంగా అనిపించడంలేదని వ్యాఖ్యానించారు.
యోగి నోట మరిన్ని..
ఓ ఇంటర్వ్యూలోను యోగి మాట్లాడారు. తమ ప్రభుత్వంలో ఏ వర్గం కూడా అసంతృప్తితో లేదని చెప్పారు. అయోధ్య - బాబ్రీ మసీదు నిర్మాణంపై సుప్రీం కోర్టు మంచి సూచన చేసిందని చెప్పారు. హిందూ యువ వాహినిపై ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచన లేదన్నారు. దానిని పెంపొందించాలని, లేదా ఆరెస్సెస్లో విలీనం చేయాలనే ఆలోచన లేదన్నారు. అది తన పని తాను చేస్తుందన్నారు.
ఆర్నెల్లలో పార్టీ ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి
సీఎంను కాబట్టి ఆర్నెల్లలో ఎమ్మెల్యేగా లేదా ఎమ్మెల్సీగా గెలుపొందాలని, పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి చేస్తానని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. యూపీకి పరిశ్రమలు వచ్చేందుకు ఆసక్తిని చూపిస్తున్నాయన్నారు. 2019లో యూపీలో బిజెపి వంద శాతం సీట్లు గెలవాలని, ఇందుకోసం తాను ఎక్కడికైనా వెళ్తానని చెప్పారు.
అయోధ్య నుంచి పోటీ చేస్తారా?
యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలోని బిజెపి ప్రభుత్వం ఏర్పడి జూన్ 27 నాటికి 100 రోజులు పూర్తయింది. ఇక మరోవైపు ఆరు నెలల్లో ఆయన శాసనసభకు లేదా మండలికి ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఆయన అయోధ్య స్థానం నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. గడిచిన 100 రోజుల్లో తాను ఎంతో సాధించగలిగానని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను సరిదిద్దడం, ప్రభుత్వ పాలనను గాడిలో పెట్టడం వంటి అనేక చర్యలు తీసుకున్నానని వివరించారు.