మాస్కులు ధరించాల్సిన అవసరం లేదు.. 'పెళ్లి'ని సమర్థించుకుంటూ కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ-రేవతిల వివాహంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లాక్ డౌన్ వేళ వివాహ వేడుక ఎందుకు జరిపించారని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా అధికార బీజేపీ నేతలు కుమారస్వామిని తీవ్రంగా తప్పు పడుతున్నారు. రామనగర జిల్లాలో కరోనా వ్యాప్తి చెందితే దానికి కుమారస్వామి కుటుంబమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అయితే కుమారస్వామి మాత్రం వివాహ వేడుకను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా జాతీయ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మాస్కులు ధరించాల్సిన అవసరం లేదు...
ఒకవేళ నిజంగా తాము తప్పు చేసి ఉంటే.. తమపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎంకు కుమారస్వామి సవాల్ విసిరారు. జిల్లా మెజిస్ట్రేట్ అనుమతితోనే వివాహం జరిపించామని తెలిపారు. వివాహ వేడుకకు వచ్చిన ప్రతీ కారుకు అధికారులు ఇచ్చిన పాసులు ఉన్నాయన్నారు. ఇక మాస్కులు ధరించలేదని విమర్శించడాన్ని ఆయన తప్పు పట్టారు. ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) చెప్పిందన్నారు.

సోషల్ డిస్టెన్స్పై ఎదురు ప్రశ్న..
సోషల్ డిస్టెన్స్ పాటించకుండా వివాహం జరిపించినందుకు మాజీ ప్రధాని,తన తండ్రి దేవె గౌడను అరెస్ట్ చేయాలని కొంతమంది డిమాండ్ చేయడం పట్ల కుమారస్వామి విచారం వ్యక్తం చేశారు. అది తనను తీవ్రంగా బాధించిందన్నారు. కేవలం రక్త సంబంధీకులు మాత్రమే వివాహానికి హాజరయ్యారని స్పష్టం చేశారు. సోషల్ డిస్టెన్స్ పాటించట్లేదని తనను నిందించేవాళ్లను కుమారస్వామి ఎదురు ప్రశ్నించారు. ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్ వద్ద వేలాది మంది వలస కార్మికులు గుమిగూడిన ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.

విచారణకు ఆదేశించిన కమిషనర్
కార్యకర్తలు,పార్టీ నేతలను వివాహానికి పిలవనందుకు చింతిస్తున్నానని.. కరోనా కారణంగా నెలకొన్న ఈ సంక్లిష్ట పరిస్థితులకు తెరపడితే... మీ అందరితో కలిసి కూర్చొని భోజనం చేస్తానని కుమారస్వామి ఓ ట్వీట్లో పేర్కొన్నారు. కాగా,ఏప్రిల్ 17న కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ,కాంగ్రెస్ నేత కృష్ణప్ప మనవరాలు రేవతికి బెంగళూరు సమీపంలోని రామనగరలో ఉన్న ఫాంహౌజ్లో వివాహం జరిగింది. అయితే లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ కుమారస్వామి కుటుంబంపై ఆరోపణలు వస్తున్నాయి. కుమారస్వామిపై చర్యలు తీసుకోవాలని కర్ణాటక డిప్యూటీ సీఎం అశ్వథ్ నారాయణ్ రామ నగర్ కమిషనర్ను కోరారు. దీంతో వివాహ వేడుకపై విచారణ జరుపుతున్నట్టు ఆయన ప్రకటించారు.












Click it and Unblock the Notifications