మరీ అంత పెద్ద సమస్య కాదు లేవో..! చెన్నై నీటి కొరతపై స్పందించిన సీఎం పళని స్వామి..!!
చెన్నై/హైదరాబాద్ : చెన్నై నగరంలో నెలకొన్న నీటి సమస్యపై ముఖ్యమంత్రి పళని స్వామి స్పందించారు. భూగర్భ జలాలు తగ్గిపోతుండటం వల్లే చెన్నైలో నీటి కొరత ఏర్పడిందని పళనిస్వామి అన్నారు. అయితే ఇది మీడియాలో చూపించినంత పెద్ద సమస్య మాత్రం కాదంటూ వ్యాఖ్యలు చేశారు. కొన్ని వార్తలను పట్టుకుని నీటి కొరతపై ప్రజలను భ్రమపెట్టొద్దని మీడియాను ఈ సందర్భంగా కోరారు. 'ఈశాన్య రుతుపవనాలు అక్టోబరు-నవంబరుకు గానీ రాష్ట్రంలోకి రావు. అప్పటిదాకా మేం భూగర్భ జలాలపైనే ఆధారపడాలి. ఇక గతకొన్నేళ్లుగా తగినంత వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు నానాటికీ తగ్గిపోతున్నాయి. దీంతో ఈసారి నీటి కొరత కాస్త ఎక్కువగా ఉంది. అయితే ఇది మీడియాలో చూపించినంత పెద్ద సమస్యేమీ కాదు. పరిస్థితిని అర్థం చేసుకుని ప్రజలు సహకరిస్తే సమస్య పరిష్కారమవుతుంది. అయితే మీడియా కూడా కొన్ని ఘటనలు పట్టుకుని ప్రజలను భ్రమ పెట్టొద్దు' అని పళనిస్వామి మీడియాకు హితవు పలికారు.

మరోవైపు రాష్ట్రంలో నీటి సమస్యపై తగిన చర్యలు తీసుకోవట్లేదంటూ తమిళనాడు ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు మొట్టికాయలు వేసింది. సముద్రంలో వృథాగా చేరుతున్న వర్షపు నీటిని అడ్డుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టారంటూ ప్రశ్నలు సంధించింది. వేలూరులోని కాలువలో కలుషిత జలాలు విడుదలను అడ్డుకోవాలంటూ మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. జల నిర్వహణ, తాగునీటి ఎద్దడి నివారణకు చేపట్టిన చర్యలకు సంబంధించిన జీవోలను సమర్పించాలని న్యాయమూర్తులు ఆదేశించారు. జల వనరుల్లోని ఆక్రమణల తొలగింపు, పూడికతీతకు చేపట్టిన చర్యల గురించి నివేదిక సమర్పించాలని అన్ని జిల్లా కలెక్టర్లకు సర్క్యులర్లు పంపాలని ప్రజాపనుల శాఖను ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications