దీపావళి మాకు ఆఖరి కావొచ్చు: బురారీ ఆత్మహత్యల్లో కొత్త కోణం, చాన్నాళ్ల ప్లాన్!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో సంచలనం సృష్టించిన 11 మంది ఆత్మహత్య కేసులో పోస్టుమార్టం రిపోర్టులో విస్తుపోయే అంశాలు వెల్లడయ్యాయి. 11 మందిలో 10 మంది తమకు తామే ఉరివేసుకున్నట్లుగా రిపోర్టులో తేలింది. వారి శరీరాల పైన ఎలాంటి గాయాలు లేవు. 11వ వ్యక్తి నారాయణి దేవి పోస్టుమార్టం రిపోర్టు రావాల్సి ఉంది.
Recommended Video
బురారీ ఆత్మహత్యలు: మరో షాక్.. చివరి నిమిషంలో బతకాలని ఆరాటం
మరోవైపు లలిత్ డైరీ ద్వారా కూడా ఎన్నో విషయాలు వెలుగు చూస్తున్నాయి. మేం వచ్చే దీపావళిని చూడలేకపోవచ్చునని డైరీలో రాసుకున్నట్లుగా ఉంది. 11 నవంబర్ 2017న ఆయన దీనిని రాశారు. ఎవరో చేసిన తప్పులకు తాము తాము శిక్షించబడుతున్నామని, ఇదే చివరి దీపావళి అని పేర్కొన్నారు.
వచ్చే దీపావళి చూడకపోవచ్చు
ధన్తెరాస్ జరుపుకున్నామని, ఎవరి తప్పులకో మేం అనుభవిస్తున్నామని, సాధ్యమైనంత వరకు వచ్చే దీపావళిని చూడమని, ఈ హెచ్చరికలను నిర్లక్ష్యం చేయవద్దని పేర్కొన్నట్లుగా ఉంది. లలిత్ తమ కుటుంబానికి సంబంధించిన అంశాలను డైరీలో రాసుకునేవారు. దీనిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఎన్నో రోజులుగా ప్లాన్
ఈ డైరీ రాతలను బట్టి చూస్తుంటే ఆత్మహత్యలకు వారు ఎన్నో రోజుల నుంచి ప్రణాళికలు వేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. విచారణలో మరిన్ని ఆధారాలు దొరికే అవకాశముందని భావిస్తున్నారు.
నేరుగా మాట్లాడుతున్నారన్న భావనకు లోనయ్యేవారు
ఈ విషయమై పోలీసులు మాట్లాడుతూ.. బుధవారం లభ్యమైన డైరీలో లలిత్ తన తండ్రికి సంబంధించిన విషయాలు, కుటుంబ సభ్యుల వివరాలు రాసుకున్నారని, ఆయన తండ్రి 2007లో మరణించారని, ఈ డైరీ రాస్తున్నప్పుడు తన తండ్రితో నేరుగా మాట్లాడుతున్న భావనకు లలిత్ గురయ్యేవారని తెలుస్తోందని, ఈ ఆత్మహత్యలకు ఇది కూడా ఒక కారణం కావొచ్చునని పేర్కొన్నారు.
మృతుల కళ్లకు గంతలు కట్టి ఉన్నాయి
కాగా, ఈ నెల 1న ఢిల్లీలోని బురారీ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మృతదేహాలు కనిపించిన విషయం తెలిసిందే. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు మైనర్ బాలురు ఉన్నారు. 10 మంది మృతదేహాలు ఇంటి పైకప్పుకు వేలాడుతూ ఉండగా, ఓ వృద్ధురాలి మృతదేహం మాత్రం కింద కనిపించింది. వృద్ధురాలు మినహా మిగతా మృతుల కళ్లకు గంతలు ఉన్నాయి. చేతులు వెనక్కి కట్టేసి ఉన్నాయి. ఇంట్లో దొరికిన కొన్ని ప్రతులు ఈ మరణాల వెనుక మతవిశ్వాసపరమైన కారణాలున్నట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.