10వేలు చెల్లిస్తే.. వివాహ ధ్రువీకరణ పత్రానికీ ‘తత్కాల్’
న్యూఢిల్లీ: వివాహమైన ఇరవై నాలుగ్గంటల్లో ధ్రువీకరణ పత్రం పొందేందుకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే ఇందుకు 10 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఆగమేఘాలమీద అధికారికంగా వివాహ ధృవీకరణ పత్రం మీ చేతిలో పడుతుంది. పాస్పోర్టులు, రైలు టికెట్ల మాదిరిగా వివాహ ధ్రువీకరణ పత్రాల జారీకి ఢిల్లీ ప్రభుత్వం తత్కాల్ సేవలను అందుబాటులోకి తెచ్చింది.
రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసి కేవలం ఒకే ఒక్క రోజులో ధ్రువీకరణ పత్రాన్ని అందించేందుకు ఢిల్లీ రెవిన్యూ విభాగం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రతి వివాహాన్ని చట్టబద్ధం చేస్తూ 2006లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

కాగా, ఇందుకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలను కూడా జారీ చేయాలని కూడా ఆదేశించింది. ఈ ఆదేశాల ప్రకారం వివాహమైన 60 రోజుల్లోగా ధ్రువీకరణ పత్రం పొందాలి.
ఈ సర్టిఫికెట్ తక్షణం అవసరమైనవారి కోసమే కాకుండా, ఈ ప్రక్రియలో పారదర్శకత కోసం తత్కాల్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఢిల్లీ ప్రభుత్వ రెవెన్యూ సెక్రటరీ ధరమ్పాల్ వెల్లడించారు. ఏప్రిల్ 22నుంచి తత్కాల్ విధానం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. తత్కాల్ ద్వారా సర్టిఫికెట్ అవసరమైన వారు రూ.10,000 చెల్లించాల్సి ఉంటుందని ధరమ్పాల్ చెప్పారు.












Click it and Unblock the Notifications