పార్లమెంట్ లో అతిపెద్ద మూడో పార్టీకి శశికళ బిగ్ బాస్
చెన్నై: తమిళనాడు రాజకీయాలలో ఇంతకాలం శశికళ గొంతు వినిపించలేదు. మొదటి సారి 2016 డిసెంబర్ 31 తేది శశికళ గొంతు ఎలాగుంటుందో ఆ రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు. అత్యంత ముఖ్యమైన నాయకులు, శశికళ సన్నిహితులకు మాత్రమే ఆమె గొంతు ఎలా ఉంటుందో తెలుసు.
శశికళ ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడటంతో 33 సంవత్సరాల పాటు జయలలితకు నీడలా ఉన్న ఆమె గొంతు ఇలా ఉంటుంది అని ప్రపంచానికి తెలిసింది. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పడానికి శశికళ సిద్దం అయ్యారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి పార్లమెంట్ లో ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు. తరువాత ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి దేశం మొత్తం కలుపుకుంటే ఎంపీల సంఖ్యలో పార్లమెంట్ లో రెండవ స్థానం దక్కింది. అయితే కేవలం తమిళనాడు రాష్ట్రం నుంచి పోటీ చేసిన అన్నాడీఎంకే పార్టీ మూడవ స్థానంలో నిలిచింది.

లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన అన్నాడీఎంకే పార్టీ 37 మంది ఎంపీలను గెలిపించుకుంది. అన్నాడీఎంకే పార్టీ సత్తా ఎలా ఉంటుందో అనే విషయంలో జయలలిత తన సత్తా చాటుకున్నారు. ఇప్పుడు లోక్ సభలో ఎక్కువ మంది ఎంపీలు ఉన్న మూడవ పార్టీగా గుర్తింపుపొందిన అన్నాడీఎంకే పార్టీ చీఫ్ గా శశికళ ఎంపిక అయ్యారు.
లోక్ సభ డిప్యూటీ స్పీకర్ అయిన తంబిదురై సైతం అన్నాడీఎంకే పార్టీకి చెందిన వ్యక్తి అనే విషయం తెలిసిందే. పార్లమెంట్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తరువాత అత్యంత ప్రధాన్యం ఉన్న అన్నాడీఎంకే పార్టీని శశికళ ఎలా ముందుకు తీసుకు వెలుతారు ? కేంద్రంతో ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తారు ? అని దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.












Click it and Unblock the Notifications