కలకలం: భార్య, మరదలిపై కాల్పులు జరిపి.. ఎన్ఎస్జీ కమాండో ఆత్మహత్య
హర్యానా : నేషనల్ సెక్యూరిటీ గార్డు(ఎన్ఎస్జీ) కమాండో ఒకరు దారుణానికి పాల్పడ్డాడు. తన భార్య, మరదలిపై కాల్పులు జరిపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హర్యానాలోని మనేసార్ క్యాంపస్లో చోటుచేసుకుంది.
కాన్పూర్(యూపీ)కు చెందిన జితేందర్ సింగ్ బీఎస్ఎఫ్ జవానుగా సేవలందిస్తున్నాడు. ఇటీవలే డిప్యుటేషన్పై ఎన్ఎస్జీ కమాండోగా వచ్చాడు. మంగళవారం జితేందర్ సింగ్ తన సర్వీసు రివాల్వర్తో కాల్పులు జరిపాడు.
భార్య గుడాన్(30), మరదలు ఖుష్బు(17)పై కాల్పులు జరిపిన జితేందర్ సింగ్.. ఆ తరువాత అదే రివాల్వర్తో తనూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉన్నట్లుండి కాల్పుల శబ్దం వినబడడంతో ఇరుగుపొరుగు వారందరూ అతడి ఇంటికి చేరుకున్నారు.
కాల్పుల్లో గాయపడిన గుడాన్, ఖుష్బును చికిత్స నిమిత్తం రాఖ్లాండ్ ఆసుపత్రికి తరలించారు. ఈలోగా సమాచారం అందుకున్న పోలీసులు జితేందర్ సింగ్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
జితేందర్ సింగ్కు ఎనిమిదేళ్ల కూతురు, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. వీరిద్దరూ సురక్షితంగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పుల ఘటనకు దారితీసిన కారణాలేమిటన్నది ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.