మిషెల్కు మోడీ ఊహించని కానుక, ఆగ్రాలో 100 మంది అమెరికా భద్రతా సిబ్బంది
న్యూఢిల్లీ: భారత పర్యటనకు వస్తున్న అమెరికా ఫస్ట్ లేడీ మిషెల్ ఒబామాకు ప్రధాని మోడీ ఊహించని కానుక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆమె కోసం ప్రత్యేకంగా తయారు చేసిన 100 బనారస్ చీరలు, బనారస్ సిల్క్ డ్రస్ మెటీరియల్ను ఆమెను బహుమతిగా అందించనున్నారు.
ఈ చీరల ఎంపిక, అందంగా ప్యాక్ చేసి అందించే బాధ్యతను వారణాసికి చెందిన వస్త్ర ఉద్యోగుల సంఘానికి అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జౌళి మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. ప్రధాని నరేంద్రమోడీ సొంత నియోజక వర్గమైన వారణాసి నుంచి చీరలు తెప్పించి మిషెల్ ఒబామాకు బహుమతిగా ఇవ్వనున్నారని బీజేపీ జాతీయ నాయకుడు వెల్లడించారు.

పలు అంతర్జాతీయ కార్యక్రమాల్లో మిషెల్ ఒబామా జాక్వర్డ్ పట్టు దుస్తుల్లో మెరిసిన సంగతి తెలిసిందే. భారత పట్టు అంటే మిషెల్ ఎంతో ఇష్టమని గతంలో ఓ సందర్భంలో మిషెల్ అన్నారు.
ఆగ్రాలో అమెరికా భద్రతా సిబ్బంది
భారత పర్యటనలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు అసాధారణ రీతిలో భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. తన పర్యటనలో భాగంగా జనవరి 27న ఒబామా తన కుటుంబ సభ్యులతో కలిసి ఆగ్రాలోని తాజ్ మహల్ను సందర్శించనున్నారు.
దీంతో 100 మంది అమెరికా భద్రతా సిబ్బంది ఇక్కడకు చేరుకున్నారు. 4000 మంది భారత రక్షణ సిబ్బందితో కలిసి వీరు ఒబామాకు భద్రత కల్పిస్తారు. రక్షణ ఏర్పాట్లపై బుధవారం సమావేశం నిర్వహించారు. కనీవినీ ఎరుగనిరీతిలో ఏర్పాట్లు చేస్తున్న భద్రతా సిబ్బంది ఆరు రోజుల ముందే ఢిల్లీలోని ఇండియాగేట్ను తమ ఆధీనంలోకి తీసుకొన్నారు. ఇప్పటి నుంచే సాధారణ ప్రజలకు అనుమతి నిరాకరిస్తున్నారు.












Click it and Unblock the Notifications