ఉద్యోగస్వామ్యంలో జడత్వాన్ని షేక్ చేస్తున్నారు: మోడీపై మరోసారి ఒబామా ప్రశంసలు
న్యూయార్క్/న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి ప్రశంసలు కురిపించారు. భారత ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థలో జడత్వాన్ని వదిలించేందుకు మోడీ కృషి చేస్తున్నారంటూ ఒబామా కొనియాడారు. ఇంతకుముందు మోడీని ‘మ్యాన్ ఆఫ్ యాక్షన్'గా ఒబామా ప్రశంసించిన విషయం తెలిసిందే.
ఉద్యోగస్వామ్యంలో మందకోడితనాన్ని పారదోలేందుకు మోడీ పాడుతున్నారని అన్నారు. ఇది సుదీర్ఘ ప్రక్రియ అని, ఇందులో మోడీ ఎంతవరకు విజయం సాధిస్తారో చూడాలని అన్నారు.
‘భారతదేశంలో ఎన్నో ఏళ్లుగా అధికారుల్లో పేరుకుపోయిన జడత్వాన్ని నిర్మూలించేందుకు మోడీ చేస్తున్న కృషి నన్నేంతో ఆకట్టుకుంది. ఇది సుదీర్ఘ ప్రక్రియ. ఇందులో మోడీ ఎంతవరకు విజయవంతమవుతారో చూడాలి' అని ఒబామా వ్యాఖ్యానించారు.
అగ్రశ్రేణి వ్యాపారవేత్తలతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఒబామా ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రస్తుత ఆర్థిక పరిస్థితి గురించి చర్చించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవల మయన్మార్లో జరిగిన తూర్పు ఆసియా సమ్మేళనంలో కూడా మోడీని ‘మ్యాన్ ఆఫ్ యాక్షన్' అని ఒబామా అన్నారు.
కాగా, జనవరి 26న జరగనున్న గణతంత్ర వేడుకలకు హాజరుకావాలని నరేంద్ర మోడీ పంపిన ఆహ్వానాన్ని స్వాగతిస్తున్నట్లు ఒబామా చెప్పారు. వేడుకలకు హాజరవుతానని వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి 26న న్యూఢిల్లీలో జరిగే రిపబ్లిక్ పరేడ్కు ముఖ్య అతిథిగా ఒబామా హాజరుకానున్నారు.