ఒడిశాలో మరో రైలు ప్రమాదం- కార్మికులు దుర్మరణం
భువనేశ్వర్: దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసిన ఉదంతం- కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం. ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ వద్ద కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైన తీర యావత్ దేశాన్ని విషాదంలో ముంచేసింది. ఈ ఘటనలో 275 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. 1,000కి పైగా గాయపడ్డారు. ఇప్పటికీ వారంతా వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘోర దుర్ఘటనను విస్మరించకముందే ఒడిశాలోనే మరో రైలు ప్రమాదం సంభవించింది. గూడ్స్ రైలు దూసుకెళ్లడంతో నలుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. వారికి అత్యవసర చికిత్సను అందిస్తోన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు.

జిల్లా కేంద్రమైన జాజ్పూర్ కియొంఝర్ రోడ్ రైల్వే స్టేషన్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. లూప్ లైన్లో ఉంచిన ఓ గూడ్స్ రైలు కింద ఎనిమిది మంది కార్మికులు తలదాచుకుంటోన్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఊహించని విధంగా గూడ్స్ రైలు కదలడంతో దాని కింద వారు నలిగిపోయారు. చివరి నిమిషంలో నలుగరు ప్రాణాలతో బయటపడినప్పటికీ.. వారికి తీవ్ర గాయాలయ్యాయి.
జాజ్పూర్ కియొంఝర్ రోడ్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో భారీ వర్షం కురుస్తోండటం వల్ల ఆ ఎనిమిది మంది కార్మికులు తడవకుండా ఉండటానికి గూడ్స్ రైలు కింద తలదాచుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం సంభవించినట్లు సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే జనరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై రైల్వే ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. ఖుర్దా రోడ్ డివిజినల్ మేనేజర్ సారథ్యంలో దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశారు. ఖుర్దా రోడ్ డీవీఎం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని అన్నారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సహాయాన్ని అందిస్తామని అన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు.












Click it and Unblock the Notifications