చల్లారని కుల జాడ్యం: భార్య మృతదేహాన్ని భుజాలపై ఎత్తుకుని స్మశానానికి భర్త
తన కూతురు వేరే కులం వ్యక్తితో వివాహం చేసుకుందని ఓ వ్యక్తిని బహిష్కరించారు గ్రామస్తులు.
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రాంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన కూతురు వేరే కులం వ్యక్తితో వివాహం చేసుకుందని ఓ వ్యక్తిని బహిష్కరించారు గ్రామస్తులు. దీంతో చనిపోయిన భార్య అంత్యక్రియలకు ఎవరూ రాకపోవడంతో ఒక్కడే తన భుజాల మీద వేసుకుని స్మశాన వాటికకు వెళ్లాడు. ఒక్కడే ఆమెకు అంత్యక్రియలు చేశాడు. ఈ ఘటన ఒడిశాలోని బోలంగిరి జిల్లాలోని తర్సుగూడ గ్రామంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మేఘూ భోయి అనే వ్యక్తి భార్య సజన(45) అనారోగ్యంతో మంగళవారం స్థానిక ఆస్పత్రిలో చేరింది. పరీక్షించిన వైద్యులు కొన్ని మందులు తీసుకురావాలని మేఘాకు మందుల చీటీ ఇచ్చారు. అతని వద్ద డబ్బులు లేకపోవడంతో బంధువులను సహాయం కోరాడు.
అతని కూతురు వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందనే కారణంతో బంధువులు ఎవరూ కూడా సాయం చేసేందుకు ముందుకు రాలేదు. కాగా, స్థానిక మందుల దుకాణాదారు కావాల్సిన మందులు ఇచ్చి సాయం చేశాడు. అయితే, మందులు తీసుకుని ఆస్పత్రికి చేరుకోవడం చాలా ఆలస్యమైంది. దీంతో చికిత్స పొందుతున్న సజన తుదిశ్వాస విడిచింది.
కాగా, సజన మృతదేహాన్ని స్మశాన వాటికకు తరలించేందుకు కూడా బంధువులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో అతడే తన భుజాలపై మోసుకుని స్మశానవాటికికు చేరుకున్నాడు. ఐదు పెద్ద టైర్లు, ఆకులు వేసి ఆమె మృతదేహాన్ని దహనం చేశాడు.