ఏపీకి ప్రత్యేకహోదా వద్దు: ఒడిశా ఎంపీ, రాజధానికివ్వండి: సౌగత్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి తాము వ్యతిరేకమని ఒడిశా పార్లమెంటు సభ్యుడు ఆర్కె జనా అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కూడా తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుతో ఒడిశాలోని 3 లక్షల మంది గిరిజనులు నిరాశ్రయులవుతారన్నారు.
ఒడిశా సీఎం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆధ్వర్యంలో ఇదే విషయం కేంద్రానికి కూడా విజ్ఞప్తి చేశామన్నారు. పోలవరంతో భారీ అటవీ ప్రాంతం ముంపునకు గురవుతుందన్నారు. ఒడిశా ప్రయోజనాలు రక్షించాకో పోలవరం ప్రాజెక్టు పైన ముందుకెళ్లాలన్నారు.
రాజధానికి కేంద్రం నిధులివ్వాలి: సౌగత్ రాయ్
ఆంధ్రప్రదేశ్ రాజధానికి కేంద్రమే నిధులు ఇవ్వాలని మరో ఎంపీ సౌగత్ రాయ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలు సోదర భావంతో మెలగాలన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదాపై నా మాటలు మీడియా వక్రీకరించింది: మొయిలీ
ఏపీకి ప్రత్యేక హోదా ఎలా ఇస్తారంటూ కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ మాట మార్చారు! ప్రత్యేక హోదా పైన తన మాటలను మీడియా వక్రీకరించిందన్నారు. కొన్ని మాటలను తీసుకొని తప్పుగా ప్రచారం చేస్తున్నారన్నారు.
ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని, దాంతో పాటు ప్యాకేజీ ఇవ్వాలని తాను కోరానన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతీసేలా తాను మాట్లాడాలేదన్నారు. ఏపీ, తెలంగాణ ప్రాజెక్టులను తాను స్వాగతిస్తున్నానని చెప్పారు.
అతీగతీ లేదు: గుత్తా
రాష్ట్ర విభజన జరిగి తొమ్మిది నెలలు అయినా ఇంత వరకు అతీగతి లేదని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. విద్యుత్ సమస్య వచ్చినప్పుడు ఇచ్చిపుచ్చుకునే ధోరణి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కనిపించడం లేదన్నారు. రెండు రాష్ట్రాల్లో రెండు హైకోర్టులు ఏర్పాటు చేయాలన్నారు.
కృష్ణా, గోదావరి జలాల విషయమై బోర్డుకు సర్వాధికారాలు అప్పగించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసిన ఏడు మండలాల ప్రజల ఆవేదనను పట్టించుకోవాలన్నారు. వారికి అన్ని విధాలా న్యాయం జరిగేలా చూడాలన్నారు.
హైకోర్టు విభజన అంశం 50 శాతం పూర్తయిందని కేంద్రమంత్రి ఎంపీ సదనంద గౌడ అన్నారు. తెలంగాణకు హైకోర్టు, మౌలిక సదుపాయాల కోసం చూపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరామన్నారు. హైకోర్టు విభజన పైన ఏపీ, తెలంగాణలతో చర్చించామన్నారు.