మకర సంక్రాంతి మేళాలో తొక్కిసలాట: ఒకరు మృతి, పిల్లలతో సహా 20 మందికి గాయాలు
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలో పండగపూట విషాద ఘటన చోటు చేసుకుంది. కటక్ జిల్లాలో శనివారం జరిగిన తొక్కిసలాటలో ఒకరు మృతి చెందగా, చిన్నారులతో సహా మరో 20 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
మకర సంక్రాంతి మేళా సందర్భంగా బదాంబ-గోపీనాథ్పూర్ టి-బ్రిడ్జిపై పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడడంతో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసు అధికారి తెలిపారు.
ఈ ఘటనలో 45 ఏళ్ల అంజనా స్వైన్ అనే మహిళ మరణించిందని, తీవ్రంగా గాయపడిన నలుగురిని కటక్ నగరంలోని ఎస్సిబి మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చారు. ఈ మేరకు బదాంబ-నర్సింగ్పూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దేబి ప్రసాద్ మిశ్రా ధృవీకరించారు.
గాయపడిన ఇతర వ్యక్తులను బాదంబాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సిహెచ్సి)లో చేర్చినట్లు మిశ్రా తెలిపారు. పండగ సందర్బంగా ఏర్పాటు చేసిన జాతరను దర్శించుకునేందుకు, సింహనాథుని దర్శించుకునేందుకు మధ్యాహ్నం వేళ మహిళలు, చిన్నారులతో సహా భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో ఈ ఘటన చోటుచేసుకుందని అతఘర్ సబ్ కలెక్టర్ హేమంత కుమార్ స్వైన్ తెలిపారు.
కోవిడ్ మహమ్మారి కారణంగా రెండేళ్ల విరామం తర్వాత ప్రజలు ఆలయాన్ని సందర్శిస్తుండటంతో రద్దీ భారీగా ఉందని జిల్లా యంత్రాంగం తెలిపింది. కటక్, ఖోర్ధా, పూరీ, అంగుల్, దెంకనల్,బౌధ్, నయాగఢ్ జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చినట్లు సబ్ కలెక్టర్ తెలిపారు.
#WATCH | Odisha: One dead, nine injured after a stampede occurred during Makar Mela rush at Singhanath Temple in Baramba, Cuttack.
— ANI (@ANI) January 14, 2023
One dead while nine were injured in incident, three were referred to another hospital in Cuttack: Dr Ranjan Kumar Barik, Baramba hospital pic.twitter.com/t5FM7nkPKw
ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విచారం వ్యక్తం చేశారు. మృతుల బంధువులకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. 'గాయపడిన వారికి మెరుగైన ఉచిత చికిత్స అందిస్తామని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని నవీన్ పట్నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.