స్టార్ హీరోల ఇళ్లల్లో అధికారుల సోదాలు, ఎన్నికల ప్రచారం చేశారని ?, అందరివాడు !
బెంగళూరు: కన్నడ నటుడు దర్శన్ ఇంటికి వెళ్లి పులి గోళ్లను ధరించారనే ఆరోపణలపై అటవీశాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మరో హీరో జగ్గేష్ కూడా పులి గోళ్లను ధరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. హీరో జగ్గేష్ ఇంటికి కూడా అటవీ శాఖ అధికారులు వెళ్లనున్నారు. బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్లోని దర్శన్ ఇంటికి అటవీశాఖ అధికారులు వెళ్లి నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా నటుడు దర్శన్ ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం.
నటుడు దర్శన్ పులి గోళ్లను ధరించిన ఫోటో వైరల్గా మారింది, ఈ ఫోటో ఆధారంగా ఆల్ ఆర్గనైజేషన్ యూనియన్ అధ్యక్షుడు శివకుమార్ అటవీ అధికారులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో దర్శన్ ఇంటికి వెళ్లిన అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చి ఇంటిలో సోదాలు ప్రారంభించారని తెలిసింది. బెంగళూరు ఆర్ఎఫ్ఓ సహా ముగ్గురు అధికారులు దర్శన్ ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు.

హీరో దర్శన్ ఇంట్లో పులి లాకెట్ దొరికితే కష్టాలు తప్పవు అని అధికారులు అంటున్నారు. కన్నడ నటుడు, బీజేపీ ఎంపీ జగ్గేష్ ఇంటికి అధికారులు వెళ్లారు. నటుడు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు జగ్గేష్ ఇంటికి వెళ్లిన అటవీశాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. బెంగళూరులోని మల్లేశ్వర్లోని జగ్గేష్ ఇంటికి అటవీశాఖ అధికారులు వెళ్లి నోటీసులు జారీ చేసి పులి గోళ్లు గురించి సమాచారం సేకరిస్తున్నారు.
ఓ మీడియా చానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ నటుడు జగ్గేష్ తన మెడలో ఉన్న పులి గోరు లాకెట్ను చూపిస్తూ, ఇది నాకు మా అమ్మ గిఫ్ట్ గా ఇచ్చిన నిజమైన పులి గోరు అని అన్నారు. ఈ మీడియా ఇంటర్వ్యూ క్లిప్ వైరల్ అయ్యింది. హీరో, బీజేపీ ఎంపీ జగ్గేష్పై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. పులి గోరు లాకెట్ ధరించాడన్న ఆరోపణపై బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ వర్తూరు సంతోష్ అరెస్ట్ కావడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది.
పులి చర్మం ఫోటో వైరల్ కావడంతో, అటవీ అధికారులు వినయ్ గురూజీ ఆశ్రమాన్ని కూడా సందర్శించి సమాచారం సేకరించారు. నిర్మాత రాక్లైన్ వెంకటేష్ పులి గోరు లాకెట్ ధరించి ఉన్న ఫోటో వైరల్ కావడంతో అతడిని కూడా విచారించే అవకాశం ఉంది. రాక్ లైన్ వెంకటేష్ కన్నడతో పాటు తెలుగు, సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లింగా తదితర సూపర్ డూపర్ హిట్ చిత్రాలు నిర్మించారు.
నిర్మాతగానే కాకుండా రాక్ లైన్ వెంకటేష్ కన్నడ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. బిదనగెరె ధనంజయ గురూజీ పులి గోరు లాకెట్ను ధరించి ఉన్న ఫోటో కూడా వైరల్గా మారింది. గురూజీ ఆశ్రమాన్ని సందర్శించిన అటవీ అధికారులు కూడా తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో ధనంజయ గురూజీ అది నకిలీ పులి గోరు అని చెప్పారని అటవీశాఖ అధికారులు తెలిపారు.
అయితే పులి గోరు పరిశీలన కోసం ఎఫ్ఎస్ఎల్కు పంపాలని, అక్కడి నుంచి నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని అటవి శాఖ అధికారులు నిర్ణయించారని తెలిసింది. మొత్తం మీద సిద్దరామయ్య ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీకి చెందిన సినిమా హీరోలు, బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం చేసిన హీరోల మీద, పలువురు గురూజీల మీద అటవి శాఖ అధికారులు పంజా విసరడం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications