గూడ్స్ రైలులో 12 పెట్రోల్ ట్యాంకర్లు లీకేజ్: ఊపిరిపీల్చుకున్న ప్రయాణికులు, అధికారులు!
Recommended Video
బెంగళూరు: వేగంగా వెలుతున్న గూడ్స్ రైలులోని ట్యాంకర్లలో ఉన్న పెట్రోల్ లీక్ కావడంతో రైల్వే సిబ్బంది, పోలీసులు హడలిపోయారు. ఏకంగా గూడ్స్ రైలులోని 12 ట్యాంకర్లలో పెట్రోల్ లీక్ కావడం అందర్నీ ఆందోళనకు గురి చేసింది.
మంగళూరు నుంచి బెంగళూరు నగరంలోని యశవంతపురం రైల్లే స్టేషన్ కు గూడ్స్ రైలులో 15 ట్యాంకర్లలో పెట్రోల్ తీసుకువస్తున్నారు. మార్గం మధ్యలో మంగళవారం ఉదయం తుమకూరు జిల్లా కుణిగల్ సమీపంలోని యడియూరు రైల్వే స్టేషన్ దగ్గర పెట్రోల్ లీక్ అయిన విషయం రైల్వే సిబ్బంది గుర్తించారు.
మొత్తం 15 పెట్రోల్ ట్యాంకర్లతో మంగళూరు నుంచి బెంగళూరుకు గూడ్స్ రైలు బయలుదేరింది. అందులో ఏకంగా 12 ట్యాంకర్లలో పెట్రోల్ లీక్ కావడంతో రైల్వే సిబ్బంది, పోలీసులు హడలిపోయారు. స్థానికులతో పాటు రైల్వే ప్రయాణికులు గూడ్స్ రైలు దగ్గరకు వెళ్లకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.
డీఎస్పీ వెంకటేష్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పెట్రోల్ ట్యాంకర్లకు మంటలు వ్యాపించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. గూడ్స్ రైలులోని 12 ట్యాంకర్లలో ఒకే సారి పెట్రోల్ ఎలా లీక్ అయ్యింది అంటూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.