జయలలిత వేలిముద్రలు వేశారా ? రచ్చ రచ్చ
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోలుకుంటున్నారని, త్వరలో ఆమెను ఎమర్జెన్సీ వార్డు నుంచి జనరల్ వార్డుకు మార్చే అవకాశం ఉందని అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి. ఆసుపత్రిలోని రెండవ అంతస్తులో జయలలిత చికిత్స పొందుతున్నారు.
జయలలిత ప్రస్తుతం ఆస్పత్రి రెండో అంతస్థులోని ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారు. జయలలితను గతంలో దివంగత ఎంజీఆర్ చికిత్స కోసం కేటాయించిన జనరల్ వార్డులోని గదికే తరలించే అవకాశం ఉందని అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి. సీనియర్ నటి బి. సరోజాదేవి సోమవారం అపోలో ఆస్పత్రికి వెళ్లారు.
మంచి స్నేహితులం
తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నాని సరోజాదేవి అన్నారు. జయలలిత త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాపాలన చేపడతారని బి. సరోజాదేవి ఆకాంక్షించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను జయలలిత సీనిరంగంలో ఉన్న సమయంలో మంచి స్నేహితులు అని చెప్పారు.
అంతా రాజకీయం
ఉప ఎన్నికల్లో పోటీచేస్తున్న ముగ్గురు అన్నాడీఎంకే అభ్యర్థుల బీఫాంల్లో అన్నాడీఎంకే పార్టీ అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సంతకం చేయకుండా వేలిముద్ర వేయడం వివాదాలకు దారితీసింది. ఆమె అరోగ్యంగా ఉన్నపుడు అమ్మ వేలిముద్రా ? అంటూ విపక్షాలు విమర్శించాయి.
చెప్పాము కదా !
అనారోగ్య కారణంతో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సెప్టెంబరు 22వ తేదీ నుంచి చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జయలలితకు చేసిన చికిత్స మంచి ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది, దాదాపుగా కోలుకున్నారని వైద్యులు అంటున్నారు.
ఆహారం తీసుకుంటున్నారు
ఆసుపత్రిలో జయలలిత వైద్యులతో మాట్లాడుతున్నారని, స్వయంగా ఆమె ఆహారాన్ని తీసుకుంటున్నారని ఇటీవల వరకు అన్నాడీఎంకే వర్గాలు చెబుతూ వచ్చాయి. త్వరలోనే ఆమె ఆరోగ్యంగా ఇంటికి చేరుకుంటారని అన్నాడీఎంకే నాయకులు చెప్పారు.
ఉప ఎన్నికలు
అన్నాడీఎంకే చీఫ్ జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే తంజావూరు, అరవకురిచ్చి, తిరుప్పరగుండ్రంలలో ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ముగ్గురు అభ్యర్థులకు జయలలిత పార్టీ చీఫ్ హోదాలో బీ ఫాంలను జారీ చేయ్యాలి.
అంతా ఓకే
జయలలిత అంగీకారంతో కూడిన బీఫాంలను ఎన్నికల కమిషన్కు అప్పగించినపుడే అభ్యర్థులకు అన్నాడీఎంకేకి చెందిన రెండాకుల గుర్తును కేటాయిస్తారు. అన్నాడీఎంకే తరఫున పోటీచేసే అభ్యర్థులకు 1989 నుంచి జయలలిత సంతకంతో కూడిన బీఫాంలనే అందజేస్తున్నారు.
ఇప్పుడు వేలిముద్ర
ఈ నెల 28వ తేదీన అన్నాడీఎంకే అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయగా, బీ ఫాంలో జయలలిత సంతకం ఉండాల్సిన స్థానంలో ఎడమచేతి వేలిముద్ర ఉంది. అమ్మ కోలుకున్న పరిస్థితుల్లో వేలిముద్ర వేయాల్సిన అవసరం ఏముందని విపక్షాలు విమర్శలకు దిగారు.
ఎవరు వేశారు
బీఫాంలో వేలిముద్ర వేసింది తమిళనాడు సీఎం జయలలితేనా, బీఫాంలో వేలి ముద్ర చెల్లుతుందా అంటూ మరికొందరు పలు అనుమానాలను వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనకుదిగాయి. మీడియా ముందు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.
రంగంలోకి డాక్టర్ బాలాజీ
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వేలిముద్రపై సాక్షి సంతకం చేసిన రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ బాలాజీ తమిళనాడు ప్రతిపక్షాలకు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. సీఎం కుడిచేతి గుండా మందులు ఎక్కిస్తున్న కారణంగా ఎడమ చేతి బొటనవేలి ముద్రను వేయించాల్సి వచ్చిందని డాక్టర్ బాలాజీ చెప్పారు.