Omicron:కాంటాక్ట్లో ఆ 30 మంది.. ఇంటి వద్ద ఐసోలేషన్లో ఉన్నారు: ఏపీ వైద్యారోగ్యశాఖ
ఒమిక్రాన్ వేరియంట్ భయకంపితులను చేస్తోంది. వైరస్ బయటపడిన సౌతాఫ్రికా.. పాకిన ఇతర దేశాల నుంచి వచ్చినవారిని వెతికే పనిలో అధికారులు బిజీగా ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో విదేశాల నుంచి వచ్చిన 30 మంది కాంటాక్ట్లో లేరనే తొలుత వార్తలు వచ్చాయి. దీనిని ఏపీ వైద్యారోగ్య శాఖ ఖండించింది. 30 మంది ప్రయాణికులు మిస్సయ్యారనే వార్తలను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కొట్టిపారేసింది. ఏపీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ హైమావతి మీడియాతో మాట్లాడారు.
విదేశాల నుంచి వచ్చిన 30 మంది ప్రయాణికులు మిస్సయ్యారనే వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి వదంతులను ఎవరూ నమ్మొద్దని సూచించారు. ఈ విషయంలో ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. వైజాగ్, సమీప జిల్లాలకు చెందిన 30 మంది అంతర్జాతీయ ప్రయాణికుల వివరాలను కేంద్ర ప్రభుత్వం పంపించిందని తెలిపారు. వారి వారి ఇళ్లల్లో ఐసోలేషన్లో ఉండేలా వైద్య బృందాలు పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. డైరెక్ట్గా ఏపీలో విదేశీ ప్రయాణికులు దిగడానికి ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయాలు లేవని చెప్పారు.
ఏపీలో 60 మంది విదేశాల నుంచి వచ్చారు. వీరిలో 30 మంది అధికారులతో కాంటాక్ట్లో లేరని తొలుత వార్తలు వచ్చాయి. గత 10 రోజుల్లో వీరు ఏపీకి చేరుకున్నారు. ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేసి.. ఇతర పరీక్ష కోసం జినొమ్ సిక్వెన్సింగ్కు పంపించారు. 30 మంది విశాఖలో ఉంటున్నారు. మిగతా 30 మంది మాత్రం రాష్ర్టంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లారు. వారు కూడా తమ పరిధిలోనే ఉన్నారని వైద్యారోగ్యశాఖ క్లారిటీ ఇచ్చింది.
ఒమిక్రాన్ కేసులు వచ్చిన కర్ణాటక మరింత అప్రమత్తం అయ్యింది. కేసులు రెండే అంటున్న వారి ద్వారా ఐదుగురికి సోకిందనే తెలుస్తోంది. కేసుల నేపథ్యంలో బెంగళూరులో భయంకర పరిస్థితి నెలకొంది. దీంతో కొత్త కరోనా గైడ్ లైన్స్ ప్రకటించే అవకాశం ఉంది. ఇటు సీఎం బసవరాజు బొమ్మై.. కేంద్ర వైద్యారోగ్య శాఖతో సమావేశం కానున్నారు. ఇన్ ఫెక్షన్ తెంచేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చిస్తారు.
ఇటు విదేశీ ప్రయాణికులకు ఎయిర్పోర్టుల్లోనే ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు జరపాలని భారత ప్రభుత్వం తెలిపిన సంగతి తెలిసిందే. 'ఎట్ రిస్క్' జాబితాలోని దేశాల నుంచి వచ్చినవారికి ఇది తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఫలితాలు వచ్చే వరకూ ఎయిర్పోర్టులోనే ఉండాలని నిబంధన పెట్టింది. పాజిటివ్గా తేలినవారికి 14 రోజులు క్వారంటైన్, జన్యుక్రమ విశ్లేషణ కోసం వారి నమూనాలను ఇన్సాకాగ్కు పంపించాలని తెలిపింది. ప్యాసింజర్ల ట్రావెల్ హిస్టరీ సేకరించాలని సూచించింది.