ముంబై ధారవిలో ఒమిక్రాన్: జీనోమ్ సీక్వెన్స్లో 78 వేలకు పైగా కేసులు: లవ్ అగర్వాల్
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్కు చెందిన ఒమిక్రాన్ వేరియంట్.. భారత్లో మరింత విస్తరిస్తోంది. ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుదల బాట పట్టింది. కొత్తగా మరో రెండు పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. గుజరాత్, మహారాష్ట్రల్లో కొత్తగా రెండు కేసులు నమోదయ్యాయి. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 26కు చేరింది. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీలల్లో ఈ కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. వాటి సంఖ్య పెరగదనడానికి ఎలాంటి గ్యారంటీ ఉండట్లేదు.
ముంబైలోని అతి పెద్ద మురికివాడ ధారవిలో మరో కేసు రికార్డయింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఈ విషయాన్ని ధృవీకరించింది. భారత్లో ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసుల సంఖ్య 25కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ధృవీకరించారు. ఇప్పటిదాకా ఈ వేరియంట్లో గుర్తించిన పాజిటివ్ కేసులతో పోల్చి చూస్తే దీని శాతం 0.04 శాతంగా ఉందని అన్నారు.
కిందటి వారం దేశంలో కరోనా వైరస్తో కలుపుకొని పాజిటివిటీ రేటు 0.73 శాతంగా నమోదైందని, రెండు వారాలుగా రోజువారీ కేసుల సంఖ్య 10 వేలకు లోపే నమోదవుతోందని చెప్పారు. కేరళ, మహారాష్ట్రల్లో అధిక కేసులు రికార్డవుతున్నాయని లవ్ అగర్వాల్ స్పష్టం చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 43 శాతం కేసులు వెలుగులోకి వచ్చాయని అన్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు సర్వైలెన్స్, స్క్రీనింగ్ నిర్వహించాలని రాష్ట్రాలకు ఆదేశించామని చెప్పారు.
ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలని సూచించామని అన్నారు. కరోనా వైరస్ను నివారించడానికి మాస్కులను ధరించాల్సిందేనని పేర్కొన్నారు. నవంబర్ 24వ తేదీన ఒమిక్రాన్ కేసులు రెండు దేశాల్లో మాత్రమే నమోదయ్యాయని గుర్తు చేశారు. ఇప్పుడు 59 దేశాలకు విస్తరించిందని, వాటి సంఖ్య 2,936కు చేరిందని చెప్పారు. మరో 78,054 మంది పేషెంట్లకు సంబంధించిన శాంపిళ్లు ప్రస్తుతం జీనోమ్ సీక్వెన్స్ కోసం పరీక్షల్లో ఉన్నాయని, వాటికి సంబంధించిన రిపోర్టులు ఇంకా అందాల్సి ఉందని లవ్ అగర్వాల్ అన్నారు. వేల సంఖ్యలో రిపోర్టులు పరీక్షల్లో ఉన్నందున.. కేసులు పెరిగే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయపడ్డారు.
ప్రజారోగ్యానికి సంబంధించినంత వరకు ఇప్పటిదాకా జారీ చేసిన ప్రొటోకాల్స్ను మరింత పటిష్ఠంగా అమలు చేయాల్సి ఉంటుందని, ఈ దిశగా అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలను పంపించామని అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఈ దిశగా హెచ్చరికలను జారీ చేసిందని గుర్తు చేశారు. ప్రజారోగ్యానికి సంబంధించి- ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన ప్రొటోకాల్స్ను సమర్థవంతంగా అమలు చేయకపోవడం వల్లే యూరప్ దేశాల్లో ఒమిక్రాన్ కేసులు పెరిగాయని పేర్కొన్నారు.