మహారాష్ట్రలో ఒమిక్రాన్ కలకలం: ముంబైలో నేటి నుంచి రెండ్రోజులపాటు 144 సెక్షన్ అమలు
ముంబై: మహారాష్ట్రలో కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. శుక్రవారం ఒక్కరోజే మహారాష్ట్రలో ఏడు కేసులు నమోదయ్యాయి. ఇందులో మూడున్నరేళ్ల చిన్నారి కూడా ఉంది. దీంతో మహారాష్ట్రలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 17కు చేరింది.
ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ముంబైలో శనివారం నుంచి రెండు రోజులపాటు 144 సెక్షన్ విధించారు. ర్యాలీలు, మోర్చాలు వంటి కార్యక్రమాలపై నిషేధం విధించారు. అధిక సంఖ్యలో ప్రజలు ఒకచోట గుమిగూడరాదని ముంబై డిప్యూటీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
దేశంలో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 32కు చేరింది. మహారాష్ట్రలోనే అత్యధికంగా 17 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. ఇందులో ఏడు కేసులు శుక్రవారమే నమోదయ్యాయి. ఇందులో మూడు ముంబై నుంచి, పింప్రీ-చించ్వాడ నుంచి నాలుగు ఉన్నాయి. ఒమిక్రాన్ సోకిన బాధితుల్లో మూడున్నరేళ్ల చిన్నారి కూడా ఉండటం గమనార్హం.

కాగా, ఒమిక్రాన్ సోకినవారిలో నలుగురికి లక్షణాలు లేవని, ముగ్గురిలో స్వల్ప లక్షణాలు కనిపించినట్లు అధికారులు తెలిపారు. లక్షణాలు లేనివారిని కూడా సెల్ఫ్ ఐసోలేషన్లోనే ఉంచినట్లు అధికారులు తెలిపారు. కాగా, డిసెంబర్ 1 నుంచి ముంబై, పుణె, నాగపూర్ విమానాశ్రయాల ద్వారా 61వేల మందికిపైగా అంతర్జాతీయ ప్రయాణికులు రాష్ట్రానికి వచ్చినట్లు అధికారులు వెల్లడించాు. ఇందులో దాదాపు 10 వేల మంది ప్రయాణికులు ఒమిక్రాన్ వ్యాప్తి ఉన్న దేశాల నుంచి వచ్చినవారే అని తెలిపారు. వారందరినీ ట్రేస్ చేసి, పరీక్షలు చేసేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు.
Recommended Video
కాగా, కరోనా సెకండ్ వేవ్లో మహారాస్ట్ర, కేరళల్లోనే అత్యధిక కేసులు నమోదైన విషయం తెలిసిందే. దేశంలో రోజు రోజుకు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 17 కేసులు, రాజస్థాన్లో 9 కేసులు, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీలో వరుసగా మూడు, రెండు, ఒక కేసులు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications