Omicron Update:1 దాటిన R-Value, దేనికి సంకేతం..పెద్ద నగరాల్లో అలర్ట్
భారత్ను ఒమిక్రాన్ వణికిస్తోంది. ఇప్పటికే దేశంలో థర్డ్ వేవ్ సంకేతాలు కనిపిస్తున్నాయి. రోజుకు రోజు కేసులు అమాంతంగా పెరిగిపోతున్నాయి. అయితే భారత్లో థర్డ్ వేవ్ వస్తోందంటూ అధికారికంగా ఎక్కడ ప్రకటించనప్పటికీ కేసుల్లో పెరుగుదల చూస్తుంటే అదేనేమో అనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. దీంతో పలు నగరాల్లో మరింత వేగంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. అయితే కేసుల పెరుగుదలను ఇప్పుడే అంచనా వేయడం తొందరపాటే అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తొలి రెండు వేవ్స్లా అయితే పరిస్థితి లేదు కానీ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకుంటే మాత్రం ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Recommended Video

దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు
దక్షిణాఫ్రికా పాటిస్తున్న జాగ్రత్త చర్యలతో కేసుల్లో స్థిరత్వం ఉందికానీ మొత్తానికి తగ్గలేదు. ఇదే ఫార్ములాను జర్మనీ కూడా పాటిస్తూ కేసులను తగ్గించే ప్రయత్నం చేస్తోంది. ఇక క్రిస్మస్ సమయంలో కేసులు పెరిగి ఉంటాయనే అభిప్రాయం సైతం వ్యక్తమవుతోంది. అయితే సరైన డేటా లేకపోవడంతో ఎన్ని కేసులు అనేది మాత్రం చెప్పలేకున్నారు. ఇక భారత విషయానికొస్తే దేశంలో పలు ప్రధాన నగరాల్లో కరోనా కేసులు, ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అలాంటి నగరాల్లో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణే, కోల్కతా, చెన్నై ఉన్నాయి. ఈ నగరాల్లో మాత్రం కేసులు తగ్గకపోగా... క్రమంగా పెరిగిపోతున్నాయి. ఈ నగరాల్లో ఎక్కువ జనాభా ఉండటం, జనసమ్మర్దత ప్రాంతాలు కావడం కేసుల్లో పెరుగుదలకు కారణంగా ఉంది. ఇదొక్కటే కాదు.. ఈ నగరాలకే చాలామంది విదేశీయులు రాకపోకలు సాగిస్తున్నారు.

R-వాల్యూ అంటే ఏంటి..?
కరోనా పాజిటివ్ కేసుల్లో పెరుగుదలకు కారణంగా ఒమిక్రాన్ ఉంది. ముందుగా ఎక్కువ ఒమిక్రాన్ కేసులు జనసమర్దత ప్రాంతాల్లోనే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ఈ ప్రాంతాల్లోనే మంచి వనరులు, టెస్టింగ్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ ఒమిక్రాన్ మాత్రం తన దారి తాను వెతుక్కుంటూ కాటేస్తోంది. ఇక వైరస్ వేగం ఎంతమాత్రం ఉందనేది సింబల్ Rతో సూచిస్తారు. ఈ మెగానగారాలు అన్నిటిలో R విలువ 1 దాటింది. చెన్నైకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేథమేటికల్ సైన్సెస్ డిపార్ట్మెంట్కు చెందిన సీతాభ్ర సిన్హా నేతృత్వంలోని ఓ పరిశోధన బృందం పరిశోధనలు చేసి విశ్లేషించింది. వీరి పరోశోధన ప్రకారం వైరస్ సోకిన ప్రతి వ్యక్తి సగటున మరో వ్యక్తికి వ్యాపింప చేస్తున్నారని ఈ పరిశోధన వెల్లడించింది. ఇలా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయంటూ పేర్కొంది. ప్రస్తుతం ఢిల్లీ ముంబై నగరాల్లో R విలువ 2గా ఉండటం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ రెండు నగరాల్లో కరోనా సోకిన వ్యక్తి మరో ఇద్దరికి వ్యాపింప చేస్తున్నారని సిన్హా విశ్లేషించడం జరిగింది. ఈ రెండు నగరాల్లో కేసులు అత్యంత వేగంగా పెరుగుతాయని చెప్పేందుకు ఇదే నిదర్శనమని స్పష్టం చేశారు.

క్రిస్మస్ న్యూఇయర్ వేడుకలే కారణమా..
ఐరోపా, అమెరికాలాంటి దేశాల్లో కేసులు అత్యంత వేగంగా పెరగడానికి కారణం ఉంది. ఏడాది చివరిలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో భారీగా జనాలు గుమికూడి ఉంటారు. అందుకే ఇక్కడ కేసులు వేగంగా పెరిగాయని చెప్పారు. జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరించినప్పటికీ హెచ్చరికలను ప్రజలు పెడిచెవిన పెట్టారని, క్రిస్మస్ న్యూఇయర్ వేడుకలకు విఘాతం కలిగించేందుకే ఈ ప్రకటనలు చేస్తున్నారన్న అపోహే వారి కొంప ముంచిందని నిపుణులు చెబుతున్నారు. భారత్లో ఇప్పటి వరకు అలాంటి నిబంధనలు ఇంకా ప్రభుత్వం ప్రకటించలేదు. అయితే ప్రజలు కోవిడ్ నిబంధనలను క్రమం తప్పకుండా బాధ్యతగా పాటిస్తే చాలా తక్కువ నష్టంతో భారత్ బయటపడగలదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications