ప్రొఫెసర్ నిర్లక్ష్యానికి పదేళ్ల బాలుడు బలి
న్యూఢిల్లీ : ఫోన్ మాట్లాడుతూ కారు నడిపి ఓ బాలుడి హత్యకు కారణమైంది ఢిల్లీకి చెందిన ఓ ప్రొఫెసర్. ఫోన్ మాట్లాడుతూ.. రాష్ గా కారును డ్రైవ్ చేసిన ప్రొఫెసర్ అనుపమ అగర్వాల్.. నితీష్ మాన్ అనే పదేళ్ల బాలుడిని ఢీ కొట్టడంతో.. తీవ్రంగా గాయపడ్డ బాలుడు మృతి చెందాడు.
ఢిల్లీ వర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తోన్న అనుపమ.. తన మారుతి ఆల్టో కారులో చావ్లా రోడ్డుపై నుంచి వస్తూ.. సైకిల్ పై ఓ షాపుకు బయలుదేరిన నితీశ్ మాన్ ఢీ కొట్టింది. దీంతో కొద్ది నిముషాల పాటు కారు చక్రాల కింద బాలుడు నలిగిపోయినట్లుగా సమాచారం. ఘటన అనంతరం బాలుడిని అనుపమ అగర్వాల్ ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతడు చనిపోయినట్లుగా ధ్రువీకరించారు వైద్యులు.
బాలుడి మృతితో అనుపమపై రాష్ డ్రైవింగ్ కేసు నమోదు కాగా.. బెయిల్ పై ఆమె విడుదలయ్యారు. చనిపోయిన బాలుడికి ఒక సోదరుడితో పాటు సోదరి, తల్లిదండ్రులు ఉన్నారు. అతని సోదరి చెబుతున్న దాని ప్రకారం.. బాలుడు కారు యాక్సిడెంట్ కు గురైన సమయంలో.. న్యూడిల్ ప్యాకెట్ తీసుకురావడం కోసమై ఇంట్లోంచి బయలుదేరాడు.
బాలుడి తండ్రి ముఖేష్ మాన్ స్పందిస్తూ.. న్యూడిల్ ప్యాకెట్ తీసుకుని పది నిముషాల్లో ఇంట్లో ఉంటానని కుమారుడు నితీశ్ మాన్ తనతో చెప్పినట్లుగా పేర్కొన్నాడు ముఖేష్. కాగా ముఖేష్ వికలాంగుడు కావడంతో కుటుంబ పోషణ భారమంతా నితీశ్ తల్లి చూసుకుంటోంది.
పది నిముషాల్లో వచ్చేస్తానని చెప్పిన నితీశ్ మాన్ అర్థగంట గడిచినా ఇంటికి రాకపోవడంతో.. అనుమానం వచ్చిన సోదరుడు సాగర్ నితీశ్ కోపం వెతకడం మొదలుపెట్టాడు. దీంతో నితీశ్ కు యాక్సిడెంట్ అయిందని తెలియగానే కుటుంబమంతా ఘటనా స్థలికి పరిగెత్తారు. అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులను నచ్చజెప్పిన అనుపమ.. బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే అప్పటికే బాలుడు చనిపోవడంతో.. ప్రస్తుతం ఆ కుటుంబం తీవ్ర దు:ఖంలో మునిగిపోయింది.