కాంగ్రెస్ జోరు, పంజాబ్ కెప్టెన్ సిద్దూ -పీసీసీ చీఫ్గా నియామకం -వర్గపోరులో ఓడిన సీఎం -రేవంత్ రెడ్డిలా
మోదీ హవాతో పోటీ పడలేక ఏళ్లపాటు నీరసించిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ వేగం పుంజుకుంటున్నది. నిద్ర మత్తును వదిలించుకుంటూ కాంగ్రెస్ హైకమాండ్ వరుసగా సంచలన, కఠినమైన నిర్ణయాలను తీసుకుంటున్నది. 'అతనికి పీసీసీ ఇస్తే మేం రాజీనామా చేస్తాం' తరహా సీనియర్ల హెచ్చరికల్ని ఖాతరు చేయకుండా 'ఫైర్ బ్రాండ్' నేతలకే కీలక పదవులు కట్టబెడుతున్నది. తెలంగాణలో రేవంత్ రెడ్డికి పగ్గాలిచ్చిన కాంగ్రెస్ హైకమాండ్, లోక్సభా పక్ష నేతగా రాహుల్ గాంధీనీ ఒప్పించినట్లు తెలిసింది. ఉత్తరప్రదేశ్ లో ప్రియాంక గాంధీని సీఎం అభ్యర్థిగా బరిలోకి దించాలనే నిర్ణయమూ దాదాపు ఫైనలైజ్ కావొచ్చింది. అటు పంజాబ్ లోనూ సంక్షోభానికి ముగింపు పలుకుతూ నవజ్యోత్ సింగ్ సిద్ధూను పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. వివరాలివి..
కాంగ్రెస్ అనూహ్య ఎత్తుగడ: లోక్సభ నేతగా రాహుల్ గాంధీ -మోదీపై 3అస్త్రాలు -రాజ్యసభ నాయకుడిగా గోయల్
గేమ్ ఛేంజర్: huzurabadకు amit shah -ఈటలకు కేంద్రం భరోసా -డబ్బులు తీసుకొని గెలిపిద్దామన్న బండి
పంజాబ్ కెప్టెన్ సిద్దూనే
రెండేళ్లకుపైగా పంజాబ్ కాంగ్రెస్ లో కొనసాగుతోన్న సంక్షోభానికి హైకమాండ్ ముగింపు పలికింది. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూల మధ్య గొడవను అధిష్టానం పరిష్కరించింది. కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా నవజ్యోత్ సింగ్ సిద్దూ బాధ్యతలు చేపడతారని పంజాబ్ వ్యవహారాల ఇన్చార్జీ హరీశ్ రావత్ గురువారం ప్రకటించారు. సిద్ధూ నియామకానికి సంబంధించి రెండు రోజుల్లోనే ఐఏసీసీ అధికారిక ప్రకటన చేస్తుందని రావత్ తెలిపారు.
వర్గపోరులో సీఎం ఓటమి
'సిద్దూకు పీసీసీ పగ్గాలిస్తే నేను ముఖ్యమంత్రిగా ఉండను'అంటూ ఒక దశలో సంచలన వ్యాఖ్యలు చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్ చివరికి వర్గపోరులో ఓడినట్లయింది. సిద్ధూను అంతగా వ్యతిరేకించే ఆయన ఏదైనా తీవ్ర నిర్ణయం తీసుకుంటే ఎలా? అన్న ప్రశ్నకు, ''అలాంటిదేమీ ఉండదు, పార్టీ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సీఎం కరాకండిగా చెప్పారు'' అని ఇంచార్జి రావత్ స్పష్టం చేశారు. అంతేకాదు, త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కెప్టెన్ అమరీందర్ నాయకత్వంలోనే ముందుకు వెళుతుందని, ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని ఆయన కుండబద్దలు కొట్టారు.
సిద్దూకు స్వీట్ వార్నింగ్
పంజాబ్ పీసీసీ చీఫ్ గా నవజ్యోత్ సింగ్ సిద్దూ పేరును ఖరారు చేసిన పార్టీ ఇంచార్జి హరీశ్ రావత్.. సీఎంతో విభేదాల నేపథ్యంలో ఫైర్ బ్రాండ్ నేతకు హెచ్చరికలు సైతం జారీ చేశారు. ''పంజాబ్ రాష్ట్రానికి భవిష్యత్తు సిద్దూనే. కాబట్టి, ఆయన ఏ విషయం మాట్లాడినా, ఎలాంటి అభిప్రాయాలు వ్యక్త పరిచినా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మసులుకోవాలి'' అని రావత్ హెచ్చరించారు. తద్వారా పెద్దాయనతోపాటు పార్టీలోని అసమ్మతిదారులనూ కలుపుకొని పోవాల్సిందిగా హైకమాండ్ ఆయనకు సూచనలు చేసినట్లయింది.
ప్రశాంత్ కిషోర్ పట్టు పట్టడం వల్లే?
పంజాబ్ కాంగ్రెస్ లో రెండేళ్లకుపైగా సీఎం అమరీందర్, సిద్ధూల మధ్య గొడవలు జరుగుతున్నా, పరిష్కార ఫార్ములాను వెలువరించడానికి హైకమాండ్ చాలా సమయం తీసుకుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఉండటం, గతానికి భిన్నంగా ఈసారి బహుముఖ పోటీ నెలకొని ఉండటం, బీజేపీతో విభేదించిన అకాలీదళ్ ఒంటరిగా బరిలోకి దిగనుండటం, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ సైతం పంజాబ్ ఓటర్లకు భారీ తాయిలాలు ప్రకటిస్తుండటంతో కాంగ్రెస్ మరింత వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. పంజాబ్ లో కాంగ్రెస్ కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ పట్టు పట్టడం వల్లే, సీఎంకు ఇబ్బంది కలిగినా, సిద్దూను పీసీసీ చీఫ్ గా హైకమాండ్ ప్రకటించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల కిందట ప్రశాంత్ కిషోర్ నేరుగా గాంధీ త్రయం(సోనియా, రాహుల్, ప్రియాంక)తో భేటీ అయి పంజాబ్ వ్యూహాలను ఖరారు చేశారని సమాచారం. ఒక దశలో ప్రశాంత్ కిషోర్ సైతం కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కాగా,
Recommended Video
భిన్నంగా పీసీసీ కూర్పు, రేవంత్ రెడ్డిలా
నవజ్యోత్ సింగ్ సిద్దూకు పంజాబ్ పగ్గాలిచ్చిన కాంగ్రెస్ పార్టీ.. పీసీసీ కమిటీల కూర్పులోనూ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నది. సిక్కు వర్గానికి చెందిన సిద్దూ అధ్యక్షుడు కాగా, వర్కింగ్ ప్రెడిడెంట్లుగా ఇద్దరికి చోటు కల్పిస్తారని, అందులో ఒకరు దళిత నేత, మరోకరు హిందూ నేత ఉంటానే హరీశ్ రావత్ తెలిపారు. ఇన్నాళ్లూ సీఎంపై కారాలు మిరియాలు నూరిన సిద్దూ ఇకపై కొత్త బాధ్యతల్లో అందరినీ కలుపుకొని పోతారా లేదా వేచిచూడాలి. పీసీసీ చీఫ్ పదవి విషయంలో తెలంగాణ నేత రేవంత్ రెడ్డి మాదిరిగానే పంజాబ్ లో నవజ్యోత్ సింగ్ సిద్దూ సైతం సొంతవాళ్ల నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొని మరీ హైకమాండ్ మెప్పు పొందడం, వీళ్లిద్దరూ ఇతర పార్టీల్లో ఎదిగి కాంగ్రెస్ లో చేరి ఉన్నత స్థానికి చేరడం గమనార్హం. సిద్దూ పొలిటికల్ కెరీర్ బీజేపీతో మొదలైతే, రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరడం తెలిసిందే.