తొలిదశలో కోటి మందికి కరోనా వ్యాక్సిన్, వారికి ముందు: కేంద్రం సన్నాహాలు
న్యూఢిల్లీ: మరో రెండు మూడు నెలల్లో కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉండటంతో కేంద్రం ఇందుకు తగినట్లు ఏర్పాట్లు ప్రారంభిస్తోంది. ఒకవేళ కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే దేశంలో కరోనా పోరులో ముందువరుసలో ఉన్న ఆరోగ్య కార్యకర్తలకే ఇస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీటిపై అన్ని రాష్ట్రాల ఆరోగ్య సిబ్బంది సమాచారాన్ని సేకరించే పనిలో పడింది.
మొదటి కోటి మందికి వ్యాక్సిన్..
కేంద్ర ప్రభుత్వం సమాచారం ప్రకారం.. 92 శాతం ప్రభుత్వ ఆస్పత్రులు, 55శాతం ప్రైవేటు ఆస్పత్రుల నుంచి ఇప్పటికే సమాచారం సేకరించింది. కరోనా వ్యాక్సిన్ వచ్చిన వెంటనే తొలి దశలో భాగంగా దాదాపు కోటి మంది ఆరోగ్య సిబ్బందికి మొదట వ్యాక్సిన్ అందించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తుది దశ ప్రయోగాల్లో ఉన్న వ్యాక్సిన్ మధ్యంతర ఫలితాలను వెల్లడిస్తుండటం, అమెరికా, బ్రిటన్ దేశాల్లో మరికొన్ని వారాల్లోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
రాష్ట్రాల నుంచి సమాచారం..
అంతేగాక, భారతదేశంలోని వ్యాక్సిన్లు కూడా సానుకూల ఫలితాలనే ఇస్తుండటం వ్యాక్సిన్లపై ఆశలు పెంచుతున్నాయి. భారత్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే తొలుత ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలనే అంశంపై గత కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం సంప్రదింపులు జరుపుతోంది. వీటిలో భాగంగా, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఆరోగ్య సిబ్బంది సమాచారాన్ని కోరింది.
తొలి దశలో వారికే ప్రాముఖ్యత..
తొలి దశలో ముఖ్యంగా వైద్యులు, ఎంబీబీఎస్ విద్యార్థులు, నర్సులు, ఆశా వర్కర్లు మొదలైనవారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఇందుకోసం ఇప్పటికే 92 శాతం ప్రభుత్వ ఆస్పత్రులు, 55శాతం ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బంది సమాచారాన్ని సేకరించారు. వచ్చే వారంలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
Recommended Video
వ్యాక్సిన్ అందించేందుకు సాంకేతికత..
ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ప్రజలందరికీ వ్యాక్సిన్ అందజేసేందుకు కసరత్తులు చేస్తోంది. సుమారు 30 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అంతేగాక, వ్యాక్సిన్ సరఫరాకు పూర్తి సాంకేతికతను కూడా వినియోగిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. తాజాగా, మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులతో సమావేశమై ఈ విషయాన్ని ప్రస్తావించారు. కరోనా కేసులను తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. అలాగే, వ్యాక్సిన్ సరఫరాకు ఏర్పాట్లు కూడా చేసుకోవాలని సూచించారు.