ఒకే దేశం ఒకే రేషన్ కార్డు.... జనాలకు చేరని స్కీమ్... తాజా రిపోర్టులో వెల్లడి...
మార్చి 25న ప్రధాని నరేంద్ర మోదీ కరోనా లాక్ డౌన్ ప్రకటించాక దేశంలో వలస కూలీలు,పేదలు ఎదుర్కొన్న ఇబ్బందులు వర్ణాతీతం. ఉద్యోగ,ఉపాధి కోల్పోయి తినడానికి తిండి లేని పరిస్థితుల్లో వారంతా అలమటించారు. ఆలస్యంగా స్పందించినా... వలస కూలీల ఆకలి తీర్చేందుకు... కేంద్రం 'ఒకే దేశం ఒకే రేషన్' పథకంతో పాటు తాత్కాలికంగా ఉచిత రేషన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే తాజాగా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి ప్రభుత్వ అధికారులు సమర్పించిన డేటాను పరిశీలిస్తే ఈ రెండు పథకాలు లబ్దిదారులకు చేరడంలో విఫలమయ్యాయి.
జులై 2020 నాటికి ePoS ద్వారా కేవలం 2000 మంది మాత్రమే తమ సొంత రాష్ట్రాల్లో కాకుండా ఇతర రాష్ట్రాల్లో రేషన్ పొందారు. అంటే,గట్టిగా 13వేల మంది వలస కూలీలు మాత్రమే 'ఒకే దేశం ఒకే రేషన్' పథకాన్ని ఉపయోగించుకున్నారు. దాదాపు 31,500 కి.గ్రా ధాన్యాలను వీరు రేషన్ ద్వారా పొందారు. 24 రాష్ట్రాల్లోని దాదాపు 90 శాతం చౌక ధరల దుకాణాలు ఇప్పటికే ఈ పథకాన్ని అమలుచేస్తున్నాయని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు... కళ్ల ముందు కనిపిస్తున్న లెక్కలకు అసలు పొంతన కుదరడం లేదు.

ఫుడ్&పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ శాఖకు చెందిన అధికారులే జులై 2020 రిపోర్టులో 'ఒకే దేశం ఒకే రేషన్ కార్డు' పథకం అంతగా ప్రభావం చూపలేకపోయిందని పేర్కొనడం గమనార్హం. అయితే దేశంలో ఉన్న మొత్తం 5.35 లక్షల రేషన్ షాపుల్లో ఇప్పటికే 4.88 లక్షల రేషన్ షాప్స్ ePoS డివైజ్లను ఇన్స్టాల్ చేసుకున్నట్లుగా పేర్కొన్నారు. అయితే కనెక్టివిటీ కారణంగా మారుమూల ప్రాంతాల్లో ఈ డివైజ్లు పనిచేయట్లేదని రేషన్ షాపుల యజమానులు చెబుతున్నారు. చాలా రాష్ట్రాలు వన్ నేషన్ వన్ రేషన్ను ఆలస్యంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం కూడా... దాని అసలు లక్ష్యాన్ని దెబ్బతీసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications