మసాజ్ పార్లర్కి వెళ్లాడు.. ఏకంగా మృత్యు ఒడిలోకే జారుకున్నాడు!
భోపాల్: పార్టీలో ఎంజాయ్ చేస్తున్న సమయంలో హర్నబ్ సింగ్ (35) అనే వ్యక్తి మెడ పట్టేసుకుంది. తెలిసిన వ్యక్తి ఒకరు.. స్థానికంగా ఉండే ఓ మసాజ్ పార్లర్ కి వెళ్తే ఉపశమనం లభించవచ్చని సలహా ఇచ్చాడు. దీంతో నేరుగా మసాజ్ పార్లర్ కి వెళ్లిన ఆ వ్యక్తి.. మెడ నొప్పి నుంచి ఉపశమనం కాదు కదా! ఏకంగా మృత్యు ఒడిలోకి జారుకున్నాడు.
ఎముక విరిగిపోవడంతోనే ఘోరం:
అప్పటికే మెడ నొప్పితో బాధపడుతున్న హర్నబ్ సింగ్ భోపాల్ లోని మసాజ్ పార్లర్ కి వెళ్లాడు. పార్లర్ వ్యక్తి మసాజ్ చేస్తుండగా.. అతని మెడ ఎముక ఒకటి విరిగిపోయింది. దీంతో హర్నబ్ తీవ్ర అనారోగ్యానికి గురై.. ఆసుపత్రి పాలయ్యాడు. ఆ తర్వాత ఐసీయూలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.
మెడికల్ రిపోర్ట్ తో.. వెలుగులోకి:
కుమారుడు హఠాణ్మరంతో ఆ కుటుంబం షాక్ కు గురైంది. కుమారుడి మరఫంపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెడికల్ రిపోర్టుల్లో మెడ ఎముక విరిగినట్టు స్పష్టమైంది. వైద్యులు దాన్ని నిర్దారించడంతో మసాజ్ పార్లరే హర్నబ్ చావుకు కారణమని తేలింది.
అదే ట్విస్టు:
అయితే ఈ ఘటన జరిగింది ఇప్పుడు కాదు.. 2015లో. హర్నబ్ కు సంబంధించిన మెడికల్ రిపోర్టులను నిశితంగా పరిశీలించి ఇన్నాళ్లకు మసాజ్ పార్లరే హర్నబ్ చావుకు కారణమంటూ అసలు విషయం చెప్పారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వార్త మధ్యప్రదేశ్ లో చర్చనీయాంశంగా మారింది.