కుటుంబ రాజకీయాలు, టిక్కెట్లు, తేల్చేసిన కాంగ్రెస్, అదృష్ణవంతులు వీరే, కులం, గెలుపు!
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక శాసన సభ ఎన్నికలు 2018 సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఏ క్షణంలో అయినా పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. మే 12వ తేదీన జరిగే శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుల కుమారులు, కుమార్తెలు పోటీ చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
సీఎం, మంత్రులు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో సహ అనేక మంది మంత్రులు, కేంద్ర మాజీ మంత్రులు, ఎంపీలు వారి కుమారులు, కుమార్తెలను శాసన సభ ఎన్నికల్లో పోటీ చేయించాలని నిర్ణయించారు. ఇప్పటికే వారి కుమారులు, కుమార్తెల దగ్గర అర్జీలు సమర్పించి కుటుంబ రాజకీయాలు చెయ్యడానికి సిద్దం అయ్యారు.
నాయకుల నిరసనలు
ఇంత కాలం మా నియోజక వర్గాల్లో పార్టీ కోసం కష్టపడి సొంత డబ్బు ఖర్చుపెట్టి ఇప్పుడు జరిగే ఎన్నికల్లో పోటీ చెయ్యాలని ప్రయత్నాలు చేస్తుంటే ఇప్పుడు కొత్తగా మీ కుటుంబ సభ్యులను పోటీ చేయించడానికి సిద్దం అవుతున్నారా అంటూ స్థానిక నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఆందోళనలో అధిష్టానం
స్థానిక నాయకులు, కార్యకర్తలను కాదని పార్టీ సీనియర్ నాయకుల కుమార్తెలు, కుమారులకు టిక్కెట్లు కేటాయిస్తే ఆ ప్రాంతాల్లో గెలవడం చాల కష్టం అవుతోందని కాంగ్రెస్ అధిష్టానం ఆందోళన చెందుతోందని తెలిసింది. అందుకే రాహుల్ గాంధీ ఎవ్వరికీ తెలీకుండా కర్ణాటకలోని కొన్ని నియోజక వర్గాల్లో సర్వే చేయించి నివేదిక తెప్పించుకున్నారని సమాచారం.
ముగ్గురికే అవకాశం
విశ్వసనీయ సమాచారం ప్రకారం కర్ణాటకకు చెందిన ముగ్గురు పార్టీ నాయకుల కుటుంబ సభ్యులకు మాత్రమే ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ పెద్దలు నిర్ణయించారని తెలిసింది. ఆ ముగ్గురికి మాత్రమే టిక్కెట్లు ఇస్తామని ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించారని తెలిసింది. ఏప్రిల్ 13వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీలో కర్ణాటకలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేస్తారని సమాచారం.
అదృష్ణవంతులు వీరే
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కుమారుడు డాక్టర్ యతీంద్ర మైసూరు జిల్లాలోని వరుణా నియోజక వర్గం నుంచి, హోం మంత్రి రామలింగా రెడ్డి కుమార్తె సౌమ్య రెడ్డి బెంగళూరులోని జయనగర నియోజక వర్గం నుంచి, కేంద్ర మాజీ మంత్రి కేహెచ్. మునియప్ప కుమార్తె కోలారు నుంచి పోటీ చెయ్యడానికి కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించిందని, గెలుపు ఓటములు, కుల సమీకరణాలు పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.