కరోనా ఎఫెక్ట్.. సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఇక అత్యవసర కేసులే విచారణ..
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచన మేరకు సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ తీవ్రత తగ్గేంత వరకు పరిమిత విధులను మాత్రమే నిర్వర్తించాలని నిర్ణయించింది. అత్యవసర కేసులు తప్ప.. మిగతా కేసులను విచారణను కరోనా తీవ్రత తగ్గిన తర్వాతే చేపట్టాలని నిర్ణయించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే నివాసంలో గురువారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఈ విషయాలను చర్చించారు. శుక్రవారం(మార్చి 13)నసుప్రీం కోర్టు సెక్రటరీ జనరల్ సంజీవ్ ఎస్.కల్గాంకర్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు కోర్టు ప్రాంగణాల్లోనూ న్యాయవాదులు,ప్రజలు గుమిగూడవద్దన్న ఆదేశాలను పాటిస్తున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇకపై కోర్టు గదిలోకి కేవలం పిటిషన్ దారుడు,సంబంధిత న్యాయవాదులు,ప్రతివాదిని మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. గురువారం సాయంత్రం ఎస్ఏ బోబ్డే నివాసంలో జరిగిన సమావేశంలో న్యాయమూర్తులు అరుణ్ మిశ్రా,యుయు లలిత్,అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్,సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్తా,సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రతినిధులు,సుప్రీంకోర్టు న్యాయవాదులు పాల్గొన్నారు.
హోలీ నేపథ్యంలో గత వారం రోజులుగా సుప్రీంకోర్టు సెలవుల్లో ఉంది. సెలవుల కారణంగా అత్యవసర కేసుల విచారణకు మార్చి 9,12వ తేదీల్లో వెకేషన్ బెంచ్ను ఏర్పాటు చేసింది. తిరిగి మార్చి 16వ తేదీ నుంచి కోర్టు పనిచేయనున్నప్పటికీ.. కేవలం అత్యవసర కేసులను మాత్రమే విచారించనున్నారు.
కాగా,కోవిడ్ 19ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) మహమ్మారిగా ప్రకటించడంతో ఆయా దేశాలు వైరస్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఇదే క్రమంలో భారత్ కూడా పలు చర్యలు చేపట్టింది. వైరస్ వ్యాప్తి చెందిన దేశాలకు ఇప్పటికే వీసాలను రద్దు చేసింది. అనవసర ప్రయాణాలు,పబ్లిక్ ఈవెంట్స్ రద్దు చేసుకోవాలని సూచించింది. కేంద్రమంత్రులు సైతం తమ కార్యక్రమాలను వాయిదా వేసుకున్నారు. ఢిల్లీ,బెంగళూరు నగరాల్లో థియేటర్స్,మాల్స్ మూతపడ్డాయి. తాజాగా ముంబైలోనూ మాల్స్,థియేటర్స్ మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. కరోనా వైరస్ కారణంగా కర్ణాటకలో మొదటి మరణం సంభవించడంతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.