సిఎం చాందీపై రాళ్ల దాడి, గాయాలు: ఐనా కార్యక్రమానికి
ఎర్నాకుళం: కేరళ ముఖ్యమంత్రి ఊమన్ చాందీ పైన సిపిఐ(ఎం) కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఆయనకు స్వల్పంగా గాయాలయ్యాయి. సోలార్ ప్యానెల్ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు ఈ దాడి చేశారు.
సౌర శక్తి కుంభకోణం కేసులో ఊమన్ రాజీనామా చేయాలని సిపిఐ(ఎం) ఆందోళనలు చేస్తోంది. ఆదివారం అది హింసాత్మకంగా మారింది. ముఖ్యమంత్రి ఊమన్ చాందీ కన్నూరులోని పోలీసు మైదానంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు.

ఈ సమయంలో పలువురు కార్యకర్తలు ఆయన కారు పైన రాళ్లతో దాడి చేశారు. దీంతో ఊమన్ ఉన్న కారు అద్దాలు పగిలాయి. గ్లాస్ తాకడంతో ఆయన నుదుటికి స్వల్పంగా గాయాలయ్యాయి. గాయాలు అయినప్పటికీ ఊమన్ తన పర్యటనను వాయిదా వేసుకోలేదు. కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం అతను ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లారు.
ఈ దాడిని కాంగ్రెసు, యూడిఎఫ్ భాగస్వామ్యపక్షాలు ఖండించాయి. ప్రస్తుతం కేరళలో కాంగ్రెసు భాగస్వామ్యంగా ఉన్న యూడిఎఫ్ అధికారంలో ఉంది. ఎల్డీఎప్ ప్రతిపక్షంలో కూర్చుంది.
హోంమంత్రి రాధాకృష్ణన్ ఘటనపై నివేదిక ఇవ్వాలని డిజిపిని ఆదేశించారు. ముఖ్యమంత్రిపై రాళ్ల దాడి ఘటనలో పలువురు ఎల్డీఎఫ్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications