బీజేపీయేతర కూటమి భేటీ, ఎస్పీ, బీఎస్పీ షాక్: చంద్రబాబు, రాహుల్ ఏం చెప్పారంటే?
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో బీజేపీయేతర పార్టీలు సోమవారం సమావేశమయ్యాయి. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తదితరులు ఈ భేటీకి హాజరయ్యారు. అయితే కీలక రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్కు చెందిన ఎస్పీ, బీఎస్పీల నుంచి ఎవరూ హాజరు కాలేదు. ఇది బీజేపీయేతర కూటమికి షాక్.
బీజేపీయేతర కూటమి ఏర్పాటు లక్ష్యంగా ఈ భేటీ జరగగా, 14 పార్టీలు వచ్చాయి. పార్లమెంట్ అనెక్స్ హాల్లో యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాననమంత్రి మన్మోహన్ సింగ్, టీడీపీ అధినేత చంద్రబాబు, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ అధ్యక్షులు శరద్ పవార్, జేడీఎస్ అధినేత దేవెగౌడ, లెఫ్ట్ పార్టీల నేతలు సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
భేటీ అనంతరం రాహుల్ గాంధీ, చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను బీజేపీ నిర్వీర్యం చేసిందన్నారు. బీజేపీ అవినీతి, రఫేల్ అక్రమాలపై అన్ని పార్టీలతో చర్చించామన్నారు. పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా పార్టీలన్నీ పోరాడతాయన్నారు. బీజేపీ ఓటమికి కలిసి పని చేయాలని నిర్ణయించామన్నారు.
పార్లమెంట్ లోపల, బయట చేపట్టే ఆందోళనలపై సమావేశంలో చర్చించామని చెప్పారు. విపక్ష పార్టీలకు చెందిన నేతలం అందరం రేపు రాష్ట్రపతిని కలుస్తారని చెప్పారు. దేశంలోని వ్యవస్థలను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం భ్రష్టు పట్టించిందన్నారు.