రాజ్యసభలో విపక్షాల వాకౌట్-ఎంపీల సస్సెన్షన్ ఎత్తివేతకు వెంకయ్య నిరాకరణతో
పార్లమెంటు శీతాకాల సమావేశాల రెండో రోజు కూడా విపక్షాలు నిరసనలు కొనసాగిస్తున్నాయి. తొలిరోజు విపక్షాల నిరసనల మధ్యే వ్యవసాయబిల్లులు ఎలాంటి చర్చ లేకుండా రద్దయిపోయాయి. ఇప్పుడు రెండోరోజు విపక్షాలు రాజ్యసభలో 12 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్ ను నిరసిస్తూ ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, లెఫ్ట్, ఆప్ ఎంపీలు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. ఎంపీల సస్పెన్షన్ ఎత్తేయాలని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడిని పదే పదే కోరారు. అయినా ఆయన మాత్రం అంగీకరించలేదు.
రాజ్యసభలో 12 మంది విపక్ష ఎంపీలు గత సమావేశాల్లో దురుసుగా ప్రవర్తించారంటూ ఇప్పుడు సస్పెన్షన్ విధించడంపై విపక్షాలు మండిపడ్డాయి. ఆ సస్పెన్షన్ ను ఎత్తేయాలంటూ రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడిని డిమాండ్ చేసినా ఆయన పట్టించుకోలేదు. ఇప్పటికే విపక్షాల తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న వెంకయ్య.. ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేసేందుకు ఇష్ట పడలేదు. దీంతో కొంతసేపు నిరసనలు కొనసాగించిన విపక్షాలు.. అనంతరం రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి. రాజ్యసభ నుంచి వాకౌట్ చేసిన విపక్షాల్లో కాంగ్రెస్, డీఎంకే, లెఫ్ట్, ఆప్, ఆర్జేడీ ఎంపీలు ఉన్నారు. వీరితో కలిసి నిరసనలు కొనసాగించిన టీఎంసీ ఎంపీలు మాత్రం సభలోనే ఉన్నారు.

రాజ్యసభలో విపక్షాల తీరుపై కేంద్రం కూడా ఆగ్రహంగా ఉంది. సభలో అర్ధవంతమైన చర్చలు జరగాలని ఛైర్మన్ వెంకయ్య కూడా పదే పదే విపక్షాలను కోరుతున్నారు. అయితే కీలకమైన విషయాలపై చర్చ లేకుండా కేంద్రం తప్పించుకుంటోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదే అంశంపై ఇవాళ కూడా నిరసనలు కొనసాగించిన విపక్ష సభ్యులు కేంద్రం తీరుపై ఆగ్రహంతో నినాదాలు కూడా చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. చివరికి రాజ్యసభ ఛైర్మన్ కూడా సకాలంలో స్పందించి నిరసనలను ఆపేందుకు ప్రయత్నించలేదు. దీంతో విసిగిపోయిన విపక్షాలు వాకౌట్ కే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. దీంతో వరుసగా రెండో రోజు కూడా పార్లమెంటు సమావేశాలు సక్రమంగా ముందుకు సాగడం లేదు. అయినా కేంద్రం కూడా అంతే పట్టుదలగా వ్యవహరిస్తోంది.












Click it and Unblock the Notifications