పెగాసస్, వ్యవసాయ చట్టాలపై పార్లమెంటు చర్చ జరిపేలా ఆదేశించండి: రాష్ట్రపతికి ప్రతిపక్షాల లేఖ
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పెగాసస్ హ్యాకింగ్ ఆరోపణలు, నూతన వ్యవసాయ చట్టాలు, రైతుల సమస్యలపై పార్లమెంటులో చర్చించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ అంశాలపై పార్లమెంటులో చర్చించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏడు ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్కు లేఖ రాశాయి.
రాష్ట్రపతికి రాసిన లేఖలో ఎన్సీపీతోపాటు బీఎస్పీ, ఆర్ఎల్పీ, ఎస్ఏడీ, నేషనల్ కాన్ఫరెన్స్, సీపీఐ, సీపీఎం పార్టీలు సంతకాలు చేసినట్లు ఎన్సీపీ నేత సుప్రియా సూలే తెలిపారు. అయితే, ఇందులో కాంగ్రెస్ పార్టీ లేకపోవడం గమనార్హం. ఇప్పటికే లోక్సభ, రాజ్యసభలో కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తూ నిరసనలు చేపడుతున్నాయి. చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ చేస్తోన్న ఆందోళనల్లో రైతులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్ణకరమని శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ) నేత హర్ సిమ్రత్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు చనిపోతున్నా కేంద్ర ప్రభుత్వం వారి సమస్యలపై చర్చించేందుకు ముందుకు రావడం లేదని అన్నారు.
దేశంలో రాజకీయ నాయకులు, జర్నలిస్టులతోపాటు వివిధ రంగాలకు చెందిన దాదాపు 300 మంది ప్రముఖుల ఫోన్లు హ్యాకింగ్ చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఓ పత్రికలో ఈ మేరకు వచ్చిన కథనం కలకలం రేపింది. దీంతో ప్రతిపక్షాలు కేంద్రంపై విరుచుకుపడుతున్నాయి. అయితే, ఎలాంటి హ్యాకింగ్ జరగలేదని, ప్రతిపక్షాలు అనవసర ఆందోళనలు చేస్తున్నాయని కేంద్రమంత్రులు మండిపడుతున్నారు.