కాంగ్రెసుకు ప్రతిపక్ష హోదా: తెరాసపై వెంకయ్య వ్యతిరేకత
న్యూఢిల్లీ: లోక్సభలో ప్రతిపక్ష హోదాకి ప్రజలు ఏ పార్టీనీ ఎన్నుకోలేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. అయితే ఈ అంశం ఇంకా ముగిసిపోలేదని అన్నారు. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కల్పించే నిబంధనల వెసులుబాటుకి సంబంధించిన అంతర్గత ప్రతిపాదిత అంశాన్ని సజీవంగా ఉంచారు. ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని జీర్ణించుకుని కాంగ్రెస్ పార్టీ ఆత్మావలోకనం చేసుకోవాలని వెంకయ్య సూచించారు.
కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, అయితే ఈ అంశంపై తాను ఇప్పుడే ఏమీ చెప్పలేనని ఆయన అన్నారు. సభలో 55 స్థానాలు సాధించని ఏ పార్టీకి కూడా ఈ అంశంపై మాట్లాడే అవకాశం లేదని, ఇది స్పీకర్ పరిధిలోని అంశమని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంలోని అంశాలపై కాంగ్రెస్ సభ్యులు చేసిన విమర్శల్లో సహేతుకత లేదని వెంకయ్య కొట్టిపారేశారు.

దృఢమైన, స్థిరమైన భారత నిర్మాణానికి ఉద్దేశించి సరైన మార్గంలో, సరైన ప్రాధమ్యాలను వివరిస్తూ రాష్ట్రపతి ప్రసంగం ఉందని వెంకయ్య అన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లోనూ రానున్న రెండు రోజులూ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుందని, ఈ వ్యవధిలో ప్రశ్నా సమయాన్ని మినహాయిస్తున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను బిజెపి నేత రాజీవ్ ప్రతాప్ రూఢీ ప్రారంభిస్తారని, ఆ తర్వాత లోక్జన శక్తి పార్టీ అధినేత, కేంద్ర మంత్రి రామ్విలాస్ పాశ్వాన్ మాట్లాడతారని చెప్పారు. అలాగే రాజ్యసభలో బిజెపి సీనియర్ నేత ముక్తార్ అబ్బాస్ నక్వీ చర్చను ప్రారంభిస్తారు. ఆర్థిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీ సంధాతగా వ్యవహరిస్తారు.
పోలవరం ప్రాజెక్టు అంశంపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), బిజెడి సభ్యులు లోక్సభలో ఆందోళనకు దిగడం సరికాదని వెంకయ్య చెప్పారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఇదివరకే చర్చలు ముగిశాయని, ఇప్పుడిక మరో నిర్ణయానికి తావులేదని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications