అనాథ టాపర్కు ఐఐటీ సీటు దక్కేనా? -చిన్న క్లిక్తో జీవితం తలకిందులు -రంగంలోకి సుప్రీంకోర్టు
దేశంలో విద్యా వ్యవస్థ, ఆన్ లైన్ విధానంపై ఎప్పుడో ముగిసిన చర్చ మళ్లీ మొదలైంది. 'నిమిషం' నిబంధన వల్ల పరీక్ష రాయలేకపోయామనో, మంచి మార్కులు రాలేదన్న బాధతోనో, ఫేలయ్యామన్న అవమానంతోనే ప్రాణాలు తీసుకుంటోన్న పిల్లల సంఖ్య తక్కువేమీకాదు. ఈ నేపథ్యంలో సరస్వతీపుత్రుడైన ఓ అనాథ బాలుడి గాథ అందరినీ కదిలిస్తున్నది. అతను కష్టపడి సాధించిన ఐఐటీ సీటు.. ఒక్క క్లిక్ తో గల్లంతైపోయింది. కాళ్లావేళ్లా పడినా.. కాలేజీ వాళ్లు కాదు పొమ్మన్నారు. హైకోర్టు సూచననూ యాజమాన్యం తిరస్కరించింది. ఇప్పుడతని కోసం సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది..

వెంటాడిన దురదృష్టం..
అదృష్టం అనుకోడానికి అతనేమీ కలిగినవాడు కాదు. అమ్మానాన్నను కోల్పోయిన అనాధ. ప్రభుత్వమిచ్చే ‘ఆర్ఫన్ పెన్షన్' ఆసరాతో, బందువుల ఇళ్లలో బతుకీడుస్తున్నాడు. చిన్నప్పుడే నాన్న చనిపోయినా, పేద తల్లి పాలనలో పెరిగాడు. రెండేళ్ల కిందట అమ్మ కూడా పోయింది. ఆమెకిచ్చిన మాట ప్రకారం కష్టపడి చదివాడు. జేఈఈ-2020 పరీక్షలో అద్భుతమైన ప్రతిభ చాటుకుని ఆలిండియా 270వ ర్యాంకు పొందాడు. బాంబే ఐఐటీలో సీటు కూడా దక్కించుకున్నాడు. ఇక జీవితం మారిపోయిందని సంతోషించేలోపే.. దురదృష్టం మళ్లీ వెంటాడింది. ఐఐటీ ఆన్ లైన్ పోర్టల్ లో చిన్న క్లిక్ అతని పరిస్థితిని తలకిందులు చేసింది..

అతని పేరు సిద్ధాంత్ బాత్రా..
పైచదువుల కోసం న్యాయపోరాటటం చేస్తోన్న ఆ విద్యార్థి పేరు సిద్ధాంత్ బాత్రా(18). చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు. రెండేళ్ల క్రితం తల్లి కూడా మరణించింది. బంధువుల ఇళ్లలో ఉంటూ చదివాడు. ఇటీవలి జేఈఈ పరీక్షల్లో సత్తా చాటుకుని, ఐఐటి-బాంబేలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బిటెక్ కోర్సులో సీటు పొందాడు. అయితే అనూహ్యరీతిలో రెండు వారాల్లోనే దాన్ని కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే..

చిన్న క్లిక్తో తలకిందులు..
ఆగ్రాకు చెందిన సిద్ధాంత్ బాత్రా, ఐఐటి-జెఈఈ (అడ్వాన్స్డ్) 2020 ను ర్యాంకు సాధించి, అక్టోబర్ 18 న మొదటి కౌన్సిలింగ్ లోనే బాంబే ఐఐటీలో సీటును పొందాడు. ఆన్ లైన్ క్లాసులపై ప్రకటనలు రావడంతో, అక్టోబర్ 31 న తన రోల్ నంబర్ అప్డేషన్ కోసం సిద్ధాంత్ మళ్లీ లాగిన్ అయ్యాడు. ఆ వెబ్ సైట్ లో ‘ఫ్రీజ్' అనే ఆప్షన్ ను బోనఫైడ్ కోసమేమో అని భావించి క్లిక్ చేశాడు. కానీ నిజానికి అది ‘సీటు ఉపసంహరణ' బటన్. ఆ విషయాన్ని గుర్తించకుండానే ముంబై వెళ్లే ఏర్పాట్లలో నిమగ్నమైపోయాడు. తీరా..

చేతులెత్తేసిన ఐఐటీ..
నవంబర్ 10 న ఐఐటీ ప్రవేశం పొందిన విద్యార్థుల జాబితా విడుదల కాగా, అందులో తన పేరు లేకపోవడంతో సిద్ధాంత్ షాక్ కు గురయ్యాడు. తనకు తానే సిద్ధాంత్ సీటును ఉపసంహరించుకున్నట్లుగా లేఖ వచ్చింది. అప్పుడుగానీ తన తప్పును గ్రహించి, వెంటనే ఐఐటీ బాంబే యాజమాన్యాన్ని సంప్రదించాడు. పొరపాటున ఫ్రీజ్ బటన్ క్లిక్ చేశానని, తన పరిస్థితి దృష్ట్యా అవకాశం కల్పించాలని వేడుకున్నాడు. అందుకు యాజమాన్యం నో చెప్పడంతో సిద్ధాంత్ బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. లేట్ రిజిస్ట్రేషన్ గడువు నవంబర్ 23 కావడంతో, నవంబర్ 19నే హైకోర్టు.. అతనికి అనుకూలంగా ఆదేశాలిచ్చింది. సిద్ధాంత్ అభ్యర్థనను పరిగణించాలని ఐఐటీని కోరింది. కానీ..

వదులుకున్న సీటును మళ్లీ ఇవ్వలేం..
సిద్ధాంత్ బాత్రా అభ్యర్థనను ఐఐటీ తిరస్కరించింది. సీటు ఉపసంహరణ లేఖ(క్యాన్సిలేషన్ లెటర్)ను రద్దు చేసే అధికారం తమకు లేదని బాంబే ఐఐటీ రిజిస్ట్రార్ ప్రేమ్కుమార్ కోర్టుకు తెలిపారు. విద్యార్థి బ్యాగ్రౌండ్ ఏమిటన్నదానికంటే, విద్యాలయం అవలంభిస్తోన్న విధానాలే ముఖ్యమైనవని, నిబంధనల ప్రకారమే తాము నడుచుకుంటామని, ఐఐటీల్లో అడ్మిషన్ల వ్యవహారమంతా ‘జాయింట్ సీట్ అలాట్మెట్ అథారిటీ' నిర్వహిస్తుందని ప్రేమ్ కుమార్ వివరించారు. అంతేకాదు, అతను వదులుకున్న సీటులో వేరేవాళ్లు చేరిపోయారని, ప్రస్తుతం బాంబే ఐఐటీలో సీట్లు ఖాళీగా లేవని, సిద్ధాంత్ ఇక వచ్చే ఏడాది జేఈఈకి ప్రిపేర్ కావడం మంచిదని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. దీనిపై..
హైకోర్టు కనికరించినా, ఐఐటీ యాజమాన్యం కాదుపొమ్మనడంతో చివరికి సిద్ధాంత్ సుప్రీంకోర్టు మెట్లెక్కాడు. చిన్న పొరపాటుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని, ఐఐటీలో సీటు తనకెంతో ముఖ్యమైందని, అనాథనైన తన కోసం అదనంగా ఒకే ఒక్క సీటును కేటాయించాలని అతను వేడుకుంటున్నాడు. ఈ వినతిని పరిశీలించేందుకు భారత సుప్రీంకోర్టు అంగీకరించింది. మంగళవారం(డిసెంబర్ 1న) సుప్రీం ఈ వ్యవహారాన్ని విచారించనుంది. ఒకవేళ అతనపు సీటు కల్పించాలని కోర్టు గనుక చెబితే అది చరిత్రాత్మక తీర్పు అవుతుంది. లేదా రిజిస్ట్రార్ చెప్పినట్లు సిద్ధాంత్ మరో ఏడాది ఆగడమో, వేరే కోర్సులో చేరడమో చేయాల్సి ఉంటుంది. ఏం జరగబోతోందో ఇంకొద్ది గంటల్లో తేలిపోనుంది..












Click it and Unblock the Notifications