పాక్: భారత్నే పావుగా వాడి.. యుద్ధానికి లాడెన్ ప్లాన్
వాషింగ్టన్: కొన్నేళ్ల క్రితం మృతి చెందిన అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధాన్ని సృష్టించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడట. లాడెన్ను హతమార్చిన అమెరికన్ సీల్ కమెండోలు అతని నివాసం నుంచి కొన్ని కీలక లేఖలు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
వాటిలో 100 పత్రాలను విడుదల చేశారు. ఈ పత్రాల్లో ఎన్నో కీలక అంశాలు ఉన్నాయని తెలుస్తోంది. భారత దేశాన్ని లాడెన్ ఎప్పుడూ గమనించేవాడు. ఇండియా ప్లాన్స్ టు ఎటాక్ పాకిస్తాన్ పేరిట నోట్సు కూడా రాసుకున్నాడట.
పాకిస్థాన్కి వ్యతిరేకంగా జిహాద్ని ప్రారంభించి భారత్-పాకిస్తాన్ల మధ్య విధ్వంసం సృష్టించాలనుకున్నట్లు తాజాగా వెల్లడైంది. అందుకు ఆయన భారత్నే పావుగా వాడుకోవాలనుకున్నాడు. భారత్.. పాక్పై దాడులు చేసేందుకు ప్రయత్నిస్తోందంటూ లాడెన్ ఆరోపించేవాడని తెలుస్తోంది.
పాక్ను చీల్చడానికి అమెరికా చేస్తున్న పెద్ద కుట్రలో ఇదో భాగమని లాడెన్ రాసుకున్న 'పాకిస్థాన్లో జిహాద్' అనే బుక్లెట్లో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.
యుద్ధానికి సిద్ధమవ్వడం తప్ప మిగిలిన అన్ని ముఖ్యమైన కార్యక్రమాలను భారత్ ప్రారంభించిందని, ప్రపంచ దేశాల నుంచి 134 యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మిలిటరీ ఒప్పందం అవుతుందమని లాడెన్ తన పుస్తకంలో రాసుకున్నాడు. అంతేకాదు, పాక్ పైన గూఢచర్యానికి ఇజ్రాయల్ ఉపగ్రహాన్ని భారత్ ఉపయోగిస్తోందని... ఇలా చాలా అంశాలు అందులో ఉన్నాయి.