Kumbh Melaలో వైరస్ విస్ఫోటనం -5రోజుల్లో 1701మందికి కరోనా కాటు -హరిద్వార్ అధికారుల వెల్లడి
దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ఉధృతంగా కొనసాగుతోన్న వేళ.. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కుంభమేళాకు లక్షల మంది పోటెత్తడంతో అక్కడ వైరస్ విస్పోటనం తప్పంటూ వ్యక్తమవుతోన్న ఆందోళనలు నిజమవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో జరుగుతోన్న కుంభమేళాలో గుర్తించిన పాజిటివ్ కేసులపై స్థానిక అధికారులు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు..
శభాష్ అచ్చెన్న! -17న వైసీపీలో చేరికా? -విజయసాయిరెడ్డి అనూహ్య వ్యాఖ్యలు-జగన్ పెట్టుబడి రహస్యం ఇదే
కుభమేళాలో పాల్గొన్నవారికి పెద్ద ఎత్తున కొవిడ్ నిర్ధారణ టెస్టులు చేస్తున్న దరిమిలా, ఈనెల 10 నుంచి 14వ తేదీ మధ్య ఐదు రోజుల్లో మొత్తం 1701 మంది కరోనా బారిన పడినట్లు తేలింది. ఇందులో ఆర్టీ-పీసీఆర్, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టుల ఫలితాలు ఉన్నట్లు హరిద్వార్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ శంభుకుమార్ ఝా వెల్లడించారు. మరిన్ని ఆర్టీ-పీసీఆర్ టెస్టుల ఫలితాలు రావాల్సి ఉన్నదని, కేసుల సంఖ్య 2 వేలకు చేరవచ్చని ఆయన చెప్పారు.
ఉత్తరాఖండ్లోని హరిద్వార్, తెహ్రి, డెహ్రాడూన్ జిల్లాల్లో మొత్తం 670 హెక్టార్ల మేర కుంభమేళ జరుగుతోంది. ఇప్పటికే కొన్ని లక్షల మంది గంగానదిలో పవిత్ర స్నానాలు చేశారు. వీళ్లలో చాలా మంది కొవిడ్ నిబంధనలు పాటించడం లేదన్న ఫిర్యాదులు ఉన్నాయి. పోలీసులు నిబంధనలను అమలు చేయాలని చూస్తున్నా సాధ్యం కావడం లేదు. అంతలోనే ఆరోగ్య శాఖ అధికారులు కేసుల సంఖ్యను వెల్లడించడం కలకలం రేపుతున్నది. మరోవైపు..
కుంభమేళాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని అధికారికంగా వెల్లడి కావడంతో మిగతా రాష్ట్రాలన్నీ అప్రమత్తమయ్యాయి. కుభమేళాకు వెళ్లొచ్చినవారి వివరాలను సేకరించి, వారిని కట్టడి చేసే పనిలో పడ్డాయి. కర్ణాటక ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి.. కుంభమేళాకు వెళ్లొచ్చిన ప్రతి ఒక్కరూ విధిగా కొవిడ్ టెస్టులు చేయించుకుని, పాజిటివ్ వస్తే ఐసోలేషన్ లో ఉండాలని, లేదంటే చట్టపరమైన చర్యలకూ వెనుకాడబోమంటూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.