వృద్ధ రైతు పెన్షన్ ఖాతాలో 52కోట్లకు పైగా నగదు .. షాకింగ్ రిక్వెస్ట్ చేసిన వృద్ధుడు !!
బీహార్ రాష్ట్రంలో జనాలు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతున్నారు. జనాల ఖాతాల్లో ఇబ్బడిముబ్బడిగా డబ్బులు వచ్చి పడుతున్నాయి. ఏం జరుగుతుంది అన్నది ఊహించే లోపే చేతికందింది అనుకున్న స్వర్గం కాస్త మాయమైపోతుంది. అసలేం జరుగుతుంది. ఈ డబ్బులు ఎవరు ఎక్కడ నుండి తమ ఖాతాలలో వేస్తున్నారు అన్నది ఇప్పుడు బీహార్ లో హాట్ టాపిక్ అయింది.
ఇద్దరు విద్యార్థుల ఖాతాల్లో 900 కోట్లకు పైగా నగదు .. అదృష్ట లక్ష్మి తలుపు తట్టిందని సంబరం .. అంతలోనే
బీహార్ లో ఒక వృద్ధుడి ఖాతాలో 52 కోట్లకు పైగా నగదు
బీహార్ రాష్ట్రానికి చెందిన ఒక వృద్ధుడు పెన్షన్ ఖాతాలో 52 కోట్లకు పైగా నగదు జమ కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అంతకు ముందు ఇద్దరు విద్యార్థులకు 900 కోట్లకు పైగా నగదు వారి ఖాతాలో జమ కావడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బీహార్ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఘటనలు స్థానికంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. అయితే నగదు ఖాతాలో పడిన ఏ ఒక్కరూ అందులో నుండి ఒక రూపాయి కూడా తీసుకోవడానికి వీలులేని పరిస్థితులు వారిని తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి.
బాబ్బాబు.. మొత్తం కాకున్నా .. కొంతైనా ఇవ్వండి అంటూ వృద్ధుడి విజ్ఞప్తి
బీహార్ రాష్ట్రంలోని ముజఫరాబాద్ జిల్లాలో కటిహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గ్రామానికి చెందిన రామ్ బహదూర్ షా ఖాతాలో 52 కోట్ల రూపాయలు ఉన్నాయని తెలియడంతో ఒక్కసారిగా అతను ఆశ్చర్యపోయాడు. కేవలం పెన్షన్ మీద ఆధారపడి జీవనం సాగించే ఆ వృద్ధ రైతు ఖాతాలో 52 కోట్లు జమ కావడంతో ఆ వృద్ధ రైతు ఎంతో సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఇక వాటిని తీసుకోలేనని తెలిసి ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేశారు. బాబ్బాబు... మొత్తం నాకు ఇవ్వకున్నా, ఈ మొత్తంలో కొంతైనా ఇవ్వండి అంటూ ప్రభుత్వాన్ని ప్రాధేయ పడుతున్నాడు. ఆ డబ్బు ద్వారా తను జీవితాంతం సాఫీగా బ్రతికేస్తాను అంటున్నాడు.
పెన్షన్ కోసం వెళ్తే 52కోట్లు ఉన్నట్టుగా గుర్తించిన రైతు
రామ్ బహదూర్ షా అనే రైతు, తన పెన్షన్ అకౌంట్ చెక్ చేసుకోవడానికి సమీపంలోని సీఎస్పీ అధికారిని కలిశానని చెప్పాడు. అతను తన ఆధార్ కార్డును ఇచ్చి ధృవీకరణ కోసం అతని వేలిముద్రలు ఇచ్చినప్పుడు ఖాతా బ్యాలెన్స్ రూ. 52 కోట్లకు పైగా ఉన్నట్లు తెలిసింది. ఇక ఈ విషయం తెలిసి ఆ మొత్తం ఎక్కడ నుండి వచ్చింది అని ఆశ్చర్యపోయానని రామ్ బహదూర్ షా అన్నారు. తాము వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తానని, ఈ మొత్తంలో కొంత మొత్తాన్ని మాత్రమే తమకు ఇవ్వమని విజ్ఞప్తి చేస్తున్నాం అంటూ ఆయన పేర్కొన్నారు.
బీహార్ లో వరుస ఘటనలు .. ఆ డబ్బు ఎక్కడిది ?
ఇక ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం, తాము ఈ విషయం గురించి స్థానిక అధికారులకు తెలియజేశామని , రామ్ బహదూర్ షా కు ఖాతా ఉన్న సంబంధిత బ్యాంక్ అధికారిని కూడా వివరాలు అడిగి తెలుసుకుంటారు అని పేర్కొన్నారు. బీహార్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఊహించని విధంగా ఇలా నగదు బదిలీ కావడం ఇదే మొదటిసారి కాదు. మొన్నటికి మొన్న ఇద్దరు పాఠశాల విద్యార్థులు వారి ఖాతాలలో రూ .900 కోట్లకు పైగా నగదు జమ అయినట్లుగా వార్తలు రాగా, అధికారులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇక అంతకు ముందు పొరబాటున ఓ వ్యక్తి ఐదున్నర లక్షల ను ఒక ఖాతా కి పంపించు పోయి మరో ఖాతాకు బదిలీ చేయగా, అతను ప్రధాని నరేంద్ర మోడీ తనకు డబ్బులు ఇచ్చాడని నగదు తిరిగి ఇవ్వడానికి నిరాకరించాడు. వరుస ఘటనలతో బీహార్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్న చర్చ ఆసక్తికరంగా మారింది.