జనవరి 2న దేశమంతా కరోనా వ్యాక్సినేషన్ డ్రై రన్- భారీ ప్రక్రియకు కేంద్రం ఏర్పాట్లు
మూడు రోజుల క్రితం దేశంలోని ఎంపిక చేసిన నాలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన కరోనా వ్యాక్సినేషన్ డ్రై రన్ విజయవంతమైన నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రై రన్ నిర్వహించాలని నిర్ణయించింది. గతంలో పరిమితంగా నిర్వహించిన ఈ డ్రై రన్ను ఈసారి దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ నిర్వహించేందుకు కేంద్రం భారీ ఏర్పాట్లు చేస్తోంది.
కరోనా టీకాల పంపిణీపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు వీలుగా జనవరి 2న దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ డ్రై రన్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ప్రకటించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సమాచారం పంపారు. వ్యాక్సినేషన్ డ్రై రన్లో భాగంగా ఎంపిక చేసిన జిల్లాల్లోని నాలుగు నుంచి ఐదు ప్రాంతాల్లో పరిమిత సంఖ్యలో జనానికి డమ్మీ వ్యాక్సిన్లు వేస్తారు. తద్వారా రేపు వ్యాక్సిన్ వచ్చాక కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేయించుకునేలా అవగాహన కల్పిస్తారు.
దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ఎంపిక చేసిన మూడు నుంచి ఐదు ప్రాంతాల్లో ఈసారి డ్రై రన్ నిర్వహిస్తారు. కొన్ని రాష్ట్రాల్లో అయితే మారుమూల ప్రాంతాల్లోనూ ఈ డ్రైన్ నిర్వహించాలని నిర్ణయించారు. కేరళ, మహారాష్ట్రల్లో రాజధానులకు బదులుగా ఇతర జిల్లాల్లో ఈ డ్రైన్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కరోనా వ్యాక్సిన్ రాగానే టీకా వేయించుకోవాలనుకునే వారు కో విన్ యాప్ వాడేందుకు వీలుగా కూడా అవగాహన కల్పించాలని ఆరోగ్యమంత్రిత్వశాఖ భావిస్తోంది. ఈ మేరకు డ్రై రన్కు వచ్చే వారికి అవగాహన కల్పిస్తారు.