చివరి మైలురాయి... కోవిషీల్డ్ క్లినికల్ ట్రయల్స్పై సీరమ్ ఇన్స్టిట్యూట్ కీలక ప్రకటన...
ప్రపంచవ్యాప్తంగా చాలావరకు కరోనా వ్యాక్సిన్లు చివరి దశ ప్రయోగాల్లో ఉన్నాయి. భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కోవ్యాక్సిన్,ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ది చేసిన కోవిషీల్డ్ భారత్లో చివరి దశ ప్రయోగాల్లో ఉన్నాయి. రెండు రోజుల క్రితమే రష్యా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కూడా క్లినికల్ ట్రయల్స్ కోసం భారత్ చేరింది. ఈ పరిణామాలను గమనిస్తే... భవిష్యత్తులో భారత్కు వ్యాక్సిన్ ఢోకా ఉండదన్న నమ్మకం కలుగుతోంది.
తాజాగా పుణేకి చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(SII) సీఈవో అదర్ పుణావాలా మాట్లాడుతూ... కోవిషీల్డ్ వ్యాక్సిన్ ప్రయోగాల్లో ప్రస్తుతం తాము చివరి మైలురాయి వద్ద ఉన్నామన్నారు. తాజాగా 1600 మంది వాలంటీర్లకు అవసరమైన మోతాదులో కోవిషీల్డ్ ఇచ్చామని... 28 రోజుల పాటు వారందరినీ మెడికల్ పర్యవేక్షణలో ఉంచామని తెలిపారు. భారత్ కోవిడ్ 19పై పోరులో ఐసీఎంఆర్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఆరోగ్య రంగంలో వ్యవస్థీకృత మార్పులకు అవకాశం చిక్కిందన్నారు.
మరోవైపు అమెరికా ఫార్మా దిగ్గజం అభివృద్ది చేసిన 'కోవావ్యాక్స్' క్లినికల్ ట్రయల్స్ను కూడా సీరమ్ ఇన్స్టిట్యూట్ చేపట్టనుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR)తో కలిసి సంయుక్తంగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనుంది. ప్రస్తుతం ఐసీఎంఆర్,సీరమ్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా.. దేశవ్యాప్తంగా 15 వేర్వేరు కేంద్రాల్లో కోవిషీల్డ్ రెండో దశ,మూడో దశ ప్రయోగాలు చేపడుతున్నాయి. క్లినికల్ ట్రయల్ సైట్ ఛార్జీలను ఐసీఎంఆర్ చూసుకుంటుండగా.. ఇతర ఖర్చులను సీరమ్ ఇన్స్టిట్యూట్ చూసుకుంటోంది. యూకె,బ్రెజిల్,సౌతాఫ్రికా,అమెరికాల్లోనూ ఈ వ్యాక్సిన్పై పెద్ద ఎత్తున ప్రయోగాలు జరుగుతున్నాయి.