దేశవ్యాప్తంగా ప్రతీ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్.. కేంద్రం కీలక నిర్ణయం.. త్వరలోనే అందుబాటులోకి
దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సపోర్ట్కి విపరీతమైన డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు దేశవ్యాప్తంగా ప్రతీ జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. పీఎం కేర్స్ నిధులతో దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం 551 ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పనున్నారు. త్వరలోనే ఈ ప్లాంట్లు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
Recommended Video
కొత్త ప్లాంట్లతో తీరనున్న కొరత...
జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసే ఈ ఆక్సిజన్ ప్లాంట్ల ద్వారా జిల్లా స్థాయిల్లో ఆక్సిజన్ కొరత తీరుతుందని కేంద్ర పేర్కొంది. అలాగే దేశంలో హెల్త్ కేర్ వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో ఆక్సిజన్ ప్లాంట్ పరికరాల కొనుగోలు జరుగుతుందని వెల్లడించింది. ఈ ఏడాది ఇప్పటికే దేశంలో 162 అదనపు ఆక్సిజన్ ప్లాంట్ల కోసం పీఎం కేర్స్ నిధుల నుంచి రూ.201.58 కోట్లు కేంద్రం ఖర్చు చేసింది. మొత్తంగా ఈ ఒక్క ఏడాదిలోనే 700 మెడికల్ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లకు కేంద్రం అనుమతులు ఇచ్చింది.
ఆక్సిజన్ సపోర్ట్ అవసరం పెరిగింది...
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి తీవ్ర రూపం దాల్చిన సంగతి తెలిసిందే. కొత్తగా కరోనా బారినపడుతున్నవారిలో ఎక్కువమందికి ఆక్సిజన్ సపోర్ట్ అవసరవమవుతోంది. దీంతో అన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. రెండు రోజుల క్రితం ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా 25 మంది కరోనా పేషెంట్లు చనిపోయారు. ఆ మరుసటి రోజే ఢిల్లీలోని జైపూర్ గోల్డెన్ ఆస్పత్రిలో 20 మంది కరోనా పేషెంట్లు ఆక్సిజన్ కొరత కారణంగా మృతి చెందారు. ఇలా దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఆక్సిజన్ కొరత కరోనా పేషెంట్లను బలి తీసుకుంటున్నది.
ఆ సుంకాలు మాఫీ...
ఈ నేపథ్యంలోనే ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు అన్ని జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్రం ముందుకొచ్చింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కోవిడ్ వ్యాక్సిన్లు,ఆక్సిజన్ స్టోరేజీ ట్యాంకులు,జనరేటర్లు ఇతరత్రా మెడికల్ వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ,సెస్ను కూడా మూడు నెలల పాటు మాఫీ చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రతిపక్షాల నుంచి కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. దేశంలో ఆరోగ్య సంక్షోభాన్ని అంచనా వేయడంలో కేంద్రం విఫలమైందని... కరోనా కట్టడికి ఇప్పటికీ కేంద్రం వద్ద ఎటువంటి ప్రణాళిక లేదని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి.
Oxygen plants in every district to ensure adequate oxygen availability...
— Narendra Modi (@narendramodi) April 25, 2021
An important decision that will boost oxygen availability to hospitals and help people across the nation. https://t.co/GnbtjyZzWT