ఆక్పిజన్ కొరతతో భారీ ప్రాణనష్టం: కాన్ఫరెన్స్ ప్రత్యక్షప్రసారం, ప్రధానికి సారీ చెప్పిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఆక్సిజన్ కొరత కారణంగా భారీ సంఖ్యలో ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లారు. దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో శుక్రవారం ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం నిర్వహించారు. అయితే, సమావేశంలో అరవింద్ కేజ్రీవాల్ సర్కారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంపై ప్రధాని మోడీ అసహనం వ్యక్తం చేశారు.
కేజ్రీవాల్ సర్కారు చేసిన పనిపై ప్రధాని మోడీ అసహనం
పూర్తి వివరాల్లోకి వెళితే.. శుక్రవారం జరిగిన సమావేశంలో కేజ్రీవాల్ ఆక్సిజన్ కొరతను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. కరోనాపై పోరాడేందుకు జాతీయ ప్రణాళిక ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా ముందుకెళ్లగలవంటూ కేజ్రీవాల్ మాట్లాడుతున్నారు. ఆ సమయంలోనే ప్రధాని మోడీ కల్పించుకుని.. 'ఏం జరుగుతోంది. ఇది మన సంప్రదాయానికి, నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. అంతర్గత సమావేశాన్ని ఒక ముఖ్యమంత్రి ప్రత్యక్షప్రసారం చేయిస్తున్నారు. ఇది సముచితం కాదు. మనం సంయమనం పాటించాలి' అంటూ కేజ్రీవాల్ను ఉద్దేశించి తీవ్రంగా స్పందించారు.
ప్రధానికి కేజ్రీవాల్ క్షమాపణలు.. ఆక్సిజన్ కొరతపై ఆందోళన
ఈ క్రమంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ప్రధానిని క్షమించాలని కోరారు. జాగ్రత్తగా ఉంటామన్నారు. ఆ తర్వాత కేజ్రీవాల్ తాను మాట్లాడుతున్న అంశాన్ని కొనసాగించారు. 'సర్ మాకు మీ మార్గదర్శకత్వం కావాలి. ఢిల్లీలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. ఇక్కడ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్ లేకపోతే ఢిల్లీ ప్రజలకు ప్రాణవాయువు లభించదా? ఢిల్లీకి కావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ను ఢిల్లీకి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ను వేరే రాష్ట్రంలో నిలిపివేస్తే.. దాన్ని రప్పించేందుకు ఎవరిని సంప్రదించాలో చెప్పండి. ఢిల్లీకి చేరకుండా ఆక్సిజన్ ట్యాంకర్లను నిలిపివేస్తోన్న రాష్ట్రాల విషయంలో జోక్యం చేసుకోండి. ప్రధాని మోడీజీ.. మీరు ఆ రాష్ట్రాల సీఎంలతో ఫోన్ చేసి మాట్లాడండి. అప్పుడే రాజధానికి ఆక్సిజన్ చేరుకుంటుంది' అని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఆకాశమార్గాన తరలించేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. ఆక్పిజన్ ట్యాంకర్లను ఆర్మీ బలగాలను ఎస్కార్ట్గా పంపాలని విన్నవించారు. దేశంలోని ఆక్సిజన్ ప్లాంట్లను కేంద్ర బలగాలతో స్వాధీనం చేసుకోవాలని కోరారు.
కేంద్రం ఆగ్రహం.. చింతిస్తున్నామంటూ కేజ్రీవాల్ సర్కారు
అయితే, ఇదంతా కేజ్రీవాల్ సర్కారు ప్రత్యక్షప్రసారం చేయడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ సర్కారు సమాధానమిచ్చింది. 'ఈ(ప్రధాని, సీఎంల) సమావేశాన్ని ప్రత్యక్షప్రసారం చేయకూడదని మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో.. మే ఈ నిర్ణయం తీసుకున్నాం. రహస్య సమాచారం లేని ప్రజా ప్రాముఖ్యత ఉన్న విషయాలు ప్రత్యక్షసందర్భాలున్నాయి. అయితే, జరిగినదానికి చింతిస్తున్నాం' అని సీఎం కార్యాలయం వివరణ ఇచ్చింది. అయితే, కేజ్రీవాల్ సర్కారు వివరణపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. కేజ్రీవాల్ ప్రభుత్వం దురుద్దేశంతోనే ప్రత్యక్షప్రసారం చేసిందంటూ మండిపడింది.