కోట, మిథాలీకి పద్మ ఆవార్డులు: నలుగురు తెలుగువారికి
న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురికి పద్మ అవార్డులు లభించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నటుడు కోట శ్రీనివాసరావుకు పద్మశ్రీ పురస్కారం లభించింది. తెలంగాణ రాష్ట్రం నుంచి డాక్టర్ మంజుల అనగాని, క్రికెట్ క్రీడాకారిణి మిథాలీ రాజ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధులను పద్మశ్రీ వరించింది. అమెరికాలో స్థిరపడిన ప్రముఖ వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, డాక్టర్ రఘురామ్ పిళ్లారిశెట్టిలకు ఎన్నారై కోటాలో పద్మశ్రీ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది.
గత నాలుగు దశాబ్దాలుగా చెన్నైలో స్థిరపడిన విజయనగరానికి చెందిన తెలుగు మహిళ, ప్రముఖ వయొలిన్ విద్వాంసురాలు అవసరాల కన్యాకుమారికి తమిళనాడు ప్రభుత్వం ప్రతిపాదన మేరకు పద్మశ్రీ ఇచ్చారు. ఢిల్లీలోని ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో పని చేస్తున్న తెలుగు మహిళ డాక్టర్ జయకుమారి చిక్కాలకు ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదన మేరకు పద్మశ్రీ పురస్కారం లభించింది.

హైదరాబాద్లో గైనకాలజిస్ట్/అబ్స్టెట్రేషియన్గా సేవలందిస్తున్న మంజుల అనగాని.. మూల కణాల ద్వారా ఎండోమెట్రియం చికిత్స ప్రక్రియను విజయవంతం చేశారు. ప్రముఖ లాప్రోస్కోపిక్ సర్జన్గా ఈమెకు పేరుంది. ఇక పి. రఘురాం ఆంకాలజిస్ట్. విదేశాల్లో మంచి ప్రాక్టీసు ఉన్న రఘురాం తల్లికి కేన్సర్ సోకిన తరువాత భారత్ వచ్చి ఆమెకు చికిత్స చేశారు. ఆమె పేరిట ఉషాలక్ష్మీ బ్రెస్ట్ కేన్సర్ ఫౌండేషన్ సీఈఓగా కేన్సర్పై అవగాహనా కార్యక్రమాలు చేస్తున్నారు.
ఎన్నారై కోటాలో అవార్డు పొందిన నోరి దత్తాత్రేయుడు విదేశాల్లో మంచి ఆంకాలజిస్టుగా పేరుబడ్డారు. వీరితో పాటు కర్ణాటకలో ఐజీగా పని చేస్తున్న తెలుగు తేజం ప్రతాపరెడ్డికి రాష్ట్రపతి పోలీస్ మెడల్ లభించింది. పద్మశ్రీ కంటే పెద్ద అవార్డులుగా భావించే, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు తెలుగు రాష్ర్టాలకు దక్కలేదు.
పేరు రంగం రాష్ట్రం/దేశం
డాక్టర్ మంజుల అనగాని మెడిసిన్ తెలంగాణ
మిథాలీరాజ్ క్రికెట్ తెలంగాణ
కోట శ్రీనివాసరావు కళారంగం ఆంధ్రప్రదేశ్
పివి సింధు క్రీడలు తెలంగాణ
అవసరాల కన్యాకుమారి కళారంగం తమిళనాడు
జయకుమారి చిక్కాల వైద్యరంగం ఢిల్లీ
డాక్టర్ నోరి ధత్తాత్రేయుడు మెడిసిన్ అమెరికా
డాక్టర్ రఘురామ్ పిళ్లారిశెట్టి మెడిసిన్ అమెరికా












Click it and Unblock the Notifications