గుణపాఠం నేర్చుకున్నాం - మోదీజీ సహకరించండి : పాక్ ప్రధాని అభ్యర్ధన..!!
పాక్ ప్రధానికి తత్వం బోధపడింది. జరిగిన నష్టాన్ని గుర్తించారు. మూడు యుద్దాలు జరిగితే కానీ పాకిస్థాన్ కు తెలిసి రాలేదు. ఇప్పుడు శాంతి జపం ప్రారంభించారు. భారత్ ప్రధాని మోదీ తో కలిసి మాట్లాడాలని భావిస్తున్నామంటూ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంచలన ప్రతిపాదన చేసారు. తీవ్ర ఆర్దిక సంక్షోభంతో అల్లాడిపోతున్న పాకిస్థాన్ కు ఇప్పుడు భారత్ మద్దతు కీలకం కానుంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవటం పాక్ పాలకులకు శక్తికి మించిన భారంగా మారింది. అనేక మంది పౌరుల ఆకలి తీర్చలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో పాక్ ప్రధాని భారత్ ప్రధానితో చర్చలకు సిద్దమంటూ ప్రతిపాదన చేసారు.
గుణపాఠం నేర్చుకున్నామంటూ
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తాజాగా అరబిక్ న్యూస్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన ప్రకటన చేశారు. పాకిస్థాన్ తనేంటో తెలుసుకుందని... గుణపాఠం నేర్చుకుందని చెప్పుకొచ్చారు. భారత్ తో తాము శాంతిని కోరుకుంటున్నామని చెప్పారు. భారత్ తో కలిసి పని చేయాలని భావిస్తున్నామని ముందుకొచ్చారు. కశ్మీర్ తో సహా అన్ని కీలక అంశాల పైన నిజాయితీగా చర్చించేందుకు సిద్దమని ప్రకటించారు. భారత్ ప్రధాని మోదీతో కలిసి మాట్లాడాలని భావిస్తున్నామంటూ ప్రతిపాదించారు. భారత్ తో జరిగిన మూడు యుద్దాల కారణంగా తాము కష్టాలు..పేదరికం..నిరుద్యోగం మాత్రమే సంపాదించకున్నామని..వీటి ద్వారా తాము గుణపాఠం నేర్చుకున్నామని పాక్ ప్రధాని చెప్పుకొచ్చారు.
కాశ్మీర్ పైన భారత్ తో చర్చలకు సిద్దం
కశ్మీర్ వ్యవహారాలపై కీలక వ్యాఖ్యలు చేసారు. సమస్యలను నిజాయితీగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నామని చెప్పారు. రెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటూ శాంతియతంగా అభివృద్ధిపరంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నామంటూ అభ్యర్ధించారు. కశ్మీర్ లో జరిగిందేదో జరిగిపోయిందని ..ఇక ఆపేద్దామంటూ చెప్పుకొచ్చారు. పాకిస్థాన్ శాంతిని కోరుకుంటోందన్నారు. అదే సమయంలో తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని గుర్తు చేస్తూ.. బాంబులు, మందుగుండు సామగ్రిపై వృథా అవుతున్న వనరులను ఆపాలని భావిస్తున్నామంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. భారత్తో చర్చల విషయాన్ని యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ దృష్టికి కూడా తీసుకువెళ్లినట్టు షరీఫ్ చెప్పారు.
ప్రధాని మోదీతో రాయబారం ..అంగీకరించేనా
పాకిస్థాన్ లో పరిస్థితులు రోజు రోజుకీ దిగజారుతున్నాయి. ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారు. చమురు కొరత, గోధుమ పిండి కూడా ప్రజలకు అందకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో రగిలి పోతున్నారు. ఈ సమయంలో పాక్ ప్రధాని అనూహ్యంగా భారత్ లో సత్సంబంధాల అంశం ప్రతిపాదించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్ కు ప్రపంచ దేశాల మద్దతు కావాలంటే భారత్ తో సంబంధాలు కీలకమని గుర్తించే ఈ రకమైన ప్రతిపాదన చేసినట్లు విశ్లేషణలు మొదలయ్యాయి. కశ్మీర్ అంశం నిత్యం రగిలేదని..అలాంటి అంశాలపై భారత ప్రధానితో ఆ చర్చలు ఆశిస్తున్నట్లు షెహబాజ్ చెప్పుకొచ్చారు. కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేయాలంటూ కండీషన్ పెట్టారు. పాక్ ప్రధాని ప్రతిపాదన పైన ఇప్పుడు భారత్ ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి.