పాక్ కు పోయేకాలం: 29 సార్లు కాల్పుల ఉల్లంఘన
న్యూఢిల్లీ: పాకిస్థాన్ తన నీచపు బుద్ది చూపిస్తున్నది. పాక్ యథేచ్చగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత సైనిక స్థావరాలు లక్షంగా చేసుకుని కాల్పులు జరుపుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది.
పాక్ అక్రమిత కాశ్మీర్ లో భారత సైనికులు సర్జికల్ స్ట్రైక్ దాడులు జరిపిన తరువాత పాకిస్థాన్ 29 సార్లు కాల్పులు జరిపి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరి, నౌషెరా సెక్టార్ లో సోమవారం రాత్రి పాక్ కాల్పులు జరిపింది.
అప్రమత్తం అయిన భారత సైనికులు పాక్ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొట్టాయి. పాక్ జరిపిన కాల్పుల్లో ఓ జవాను గాయపడ్డాడని ఆర్మీ అధికారులు తెలిపారు. మూడు రోజుల వ్యవధిలోనే పాక్ రెండు సార్లు కాల్పులు జరిపింది.
భారతదేశం సరిహద్దులోని కృష్ణగాటి, పూంఛ్, బల్లోయ్, పుల్వామా, ఫ్లాటాన్, గిగ్రియల్, నౌషెరా, మక్రీ, ఝూనగర్, రాజౌరీ తదితర ప్రాంతాల్లో పాక్ కాల్పులకు పాల్పడిన విషయం తెలిసింది. పాక్ పదేపదే కాల్పులు జరపడంతో స్థానిక ప్రజలు హడలిపోతున్నారు.
సరిహద్దు ప్రాంతాలు కాల్పుల మోతతో దద్దరిల్లిపోతున్నాయి. పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరుపుతుందని, తాము సమర్థవంతంగా ఎదుర్కొంటామని భారత సైనికులు అంటున్నారు.