పాక్ వెళ్తే.. నరకానికి వెళ్లినట్లే: పారికర్ తీవ్ర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దాయాది దేశం కవ్వింపు చర్యల నేపథ్యంలో రక్షణమంత్రి మనోహర్ పారికర్ పాకిస్తాన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్థాన్కి వెళ్లినా నరకానికి వెళ్లినా.. రెండూ ఒకటేనంటూ రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ మంగళవారం వ్యాఖ్యానించారు.
సోమవారం స్వాతంత్య్రదినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోడీ.. బలొచిస్థాన్, పాక్-ఆక్రమిత-కాశ్మీర్ల స్వాతంత్య్రానికి మద్దతుగా మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పారికర్ మాట్లాడుతూ.. పాక్ దేశాన్ని నరకంతో పోల్చారు.
పాకిస్థాన్కు వెళ్లటం అంటే నేరుగా నరకానికి వెళ్లటమేనని ఆయన అన్నారు. పాకిస్థాన్ మన దేశానికి భారీ నష్టం కలిగించాలని చూసిందని, అది విఫలమవడంతో చిన్న చిన్న సమస్యలు సృష్టించి దేశాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తోందని పారికర్ పేర్కొన్నారు.
సోమవారం పాకిస్థాన్ చొరబాటు చర్యల్ని భారత సైన్యం నిర్ద్వంద్వంగా నిరోధించగలిగిందని అన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్లో అంతర్భాగమని పునరుద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంద్రాగస్టు ప్రసంగానికి బలూచిస్తాన్, గిల్గిత్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు కృతజ్ఞతలు వ్యక్తం చేశారని తెలిపారు.